మ్యాచ్కు వర్షం ముప్పు:
మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో మంగళవారం భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్లో తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్లో భారత్-కివీస్ మధ్య ఇదే తొలి పోరు. లీగ్ దశలో గత నెల 13న నాటింగ్హామ్లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే భారత్-కివీస్ సెమీఫైనల్ మ్యాచ్ను కూడా వరుణుడు అడ్డుకునే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. బ్రిటిష్ వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. మాంచెస్టర్లో ఆదివారం ఎండగా ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. అయితే తీర ప్రాంతాల్లోని మేఘాల కారణంగా కొంతసేపు చిరుజల్లులు కురిశాయి. అయితే భారీ వర్షం మాత్రం పడలేదు.
చిరుజల్లులు కురిసే అవకాశం:
మ్యాచ్కు ముందు రోజు అంటే.. సోమవారం ఆకాశ మేఘావృతమై ఉండి చిరుజల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ రోజు అంటే.. మంగళవారం చిరు జల్లులతో కూడిన వర్షం పడే అవకాశముందట. మంగళవారం ఉదయం మాంచెస్టర్లో వర్షం పడే అవకాశం 50శాతం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అదే రోజు ఉదయం మ్యాచ్ 10.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఉదయం చిరుజల్లులతో కూడిన వర్షం పడితే మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశముంది.
రద్దయితే ఫైనల్కు భారత్:
లీగ్ మ్యాచ్లకు 'రిజర్వు డే' లేదు. వర్షం కారణంగా మ్యాచ్రద్దయితే చెరో పాయింట్ ఇచ్చారు. కానీ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లకు ఐసీసీ ‘రిజర్వు డే'లను కేటాయించింది. మొదటి రోజు మ్యాచ్ వర్షార్పణం అయితే ‘రిజర్వు డే' రోజు ఆడిస్తారు. ఇక రిజర్వు డే రోజు కూడా వర్షం పడితే.. ఐసీసీ నిబంధనల ప్రకారం లీగ్ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న జట్టు ఫైనల్కు చేరుతుంది. కివీస్తో సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. భారత్ ఫైనల్కు చేరుతుంది.