న్యూజిలాండ్ ఆటపై ప్రశంసలు:
ఐసీసీ నిర్వాహకులు బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ను విశ్వవిజేతగా ప్రకటించారు. అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై క్రికెట్ మాజీ దిగ్గజాలు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఐసీసీ నిబంధనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సెలబ్రిటీల నుంచి సామాన్యుడి వరకు న్యూజిలాండ్ ఆట తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు ఈ విషయమై స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు.
|
గొప్ప ఫైనల్ మ్యాచ్:
'ఇప్పటికీ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మైకంలోనే ఉన్నా. అత్యంత ఉత్కంఠకు గురి చేసింది. గొప్ప ఫైనల్ మ్యాచ్. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంగ్లాండ్ కప్ గెలిచినా.. న్యూజిలాండ్ అద్భుత ఆటతో అందరి హృదయాలను గెలుచుకుంది. ఇరు జట్లకు అభినందనలు' అని మహేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయింది.
|
భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్లో మహేష్:
ప్రపంచకప్లో భాగంగా లండన్లోని ఓవల్ మైదానం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ను మహేష్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించాడు. మ్యాచ్ వీక్షిస్తూ సెల్ఫీ దిగిన ఫొటోలను మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'నా కొడుకు గౌతమ్ కోసం మ్యాచ్ చూడడానికి వచ్చాం' అని మహేష్ పేర్కొన్నారు.
భారీ అంచనాలు:
ప్రస్తుతం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నారు. మహేష్ 26వ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ బాబు సరసన కన్నడ భామ రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. టాలీవుడ్ సీనియర్ యాక్టర్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. మహేష్ బాబు గత చిత్రం 'మహర్షి' ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.