
ప్రపంచకప్లో ఇంగ్లాండ్, భారతే ఫేవరెట్లు అని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అన్నాడు. ఈ సారి ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు బలంగా ఉందని కేపీ పేర్కొన్నాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019ను ఆతిధ్య ఇంగ్లండ్ విజయంతో ఆరంభించింది. లండన్ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మ్యాచ్ ముందు కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ... 'ఈ ప్రపంచకప్లో భారత్, ఇంగ్లాండ్ ఫేవరెట్ జట్లు. అయితే అంచనాల్లేకుండా బరిలో దిగుతున్న ఆస్ట్రేలియా, వెస్టిండీస్లను తక్కువ అంచనా వేయకూడదు. ఆ జట్లు కూడా స్టార్ ఆటగాళ్లతో ఉన్నాయి. కప్ సాధించే సత్తా ఆ జట్లకు ఉంది. తమదైన రోజున ఆస్ట్రేలియా, వెస్టిండీస్లు చెలరేగుతాయి' అని పీటర్సన్ తెలిపాడు.
'ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం బాగుంది. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఆ జట్టు విప్లవాత్మక మార్పులు సాధించింది. గతంలో మోర్గాన్తో కలిసి నేనూ ఆడాను. అతని ఆలోచనలు చాలా సానుకూల దృక్పథంతో ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. వారి ఆట తీరు ఆకట్టుకుంది. ఇంగ్లాండ్ జట్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. సొంతగడ్డపై ఆడడం కూడా ఓ సానుకూలాంశం. ఒత్తిడిని తట్టుకుంటే జట్టు కప్ సాధించొచ్చు' అని కేపీ అభిప్రాయపడ్డాడు.
గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో 104 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 207 పరుగులకే కుప్పకూలింది. జోఫ్రా ఆర్చర్ (3/27), ఫ్లంకెట్ (2/37), స్టోక్స్ (2/12)లు దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డికాక్(68), డసెన్(50) ఫర్వాలేదనిపించారు. అంతకుముందు ఇంగ్లాండ్ ఆటగాళ్లు నలుగురు అర్ధ సెంచరీలు చేయడంతో311పరుగులు చేసింది. ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న బెన్ స్టోక్స్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.