
హైదరాబాద్: ఇటీవలే రష్యా వేదికగా ఫిఫా వరల్డ్కప్ ముగిసింది. ఇప్పుడు అభిమానులంతా వన్డే వరల్డ్కప్ ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వన్డే వరల్డ్కప్కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో ఐసీసీ విడుదల చేసిన ప్రచార కార్యక్రమాలు టోర్నీపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న 12వ వన్డే వరల్డ్కప్కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోంది. 'పుట్టింటికి వరల్డ్కప్' అంటూ ఐసీసీ తన అధికారిక వెబ్సైట్లో పోస్టు చేసిన వీడియో క్రికెట్ అభిమానులను అలరిస్తోంది.
2019లో జరగనున్న వన్డే వరల్డ్కప్లో పోటీకి దిగే 10 జట్లు ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే. పది జట్లలో ఒక్కో జట్టు గ్రూప్ దశలో 9 మ్యాచ్లు ఆడాలి. గ్రూప్ దశ ముగిసిన తర్వాత టాప్-4లో నిలిచిన జట్ల మధ్య సెమీ ఫైనల్స్లో తలపడతాయి. సెమీస్లో విజయం సాధించిన రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది.
ఈ వన్డే వరల్డ్కప్కు 10 నగరాలు ఆతిథ్యమిస్తోన్నాయి. మొత్తం 11 వేదికల్లో ఈ పోటీలు జరగనున్నాయి. మరోవైపు వరల్డ్కప్ టోర్నీ షెడ్యూల్పై విమర్శలు వినిపిస్తున్నాయి. టైటిల్ నెగ్గాలంటే గ్రూప్ దశలో 9 మ్యాచ్లు ఆడాల్సి ఉండటంపై క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా, ఈ వరల్డ్కప్ మే 30న లండన్ ఓవల్ స్టేడియంలో ప్రారంభమై జులై 14న లార్డ్స్ స్టేడియంలో ముగియనుంది.