
'పదవీవిరమణ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. జూలై 30తో నా పదవీకాలం పూర్తవుతుంది. క్రికెట్ నా ప్యాషన్.. కానీ నేను జట్టు ఎంపిక ప్రక్రియలో భాగం కావడం ఇష్టం లేదు. దురదృష్టవశాత్తు ఓపెనింగ్ మ్యాచ్లో ఓడిపోయాం. తరువాత మ్యాచ్లలో రన్ రేటును సాధించడం కష్టమైంది' అని ఇంజామామ్ ఉల్ హక్ తెలిపారు.
ఇంజామామ్ తన ఒప్పందాన్ని మరో ఏడాది పాటు పొడిగించడానికి ఆసక్తి కనబరిచినప్పటికీ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం కొత్త సెలెక్టర్ కోసం అన్వేషిస్తోందట. మాజీ టెస్ట్ ఓపెనర్ మొహ్సిన్ హసన్ ఖాన్ కొత్త చీఫ్ సెలెక్టర్ రేసులో ఉన్నాడు. మొహ్సిన్ ఇంతకుముందు ఈ పదవిలో పనిచేసి మంచి ఫలితాలు సాధించాడు.
ప్రపంచకప్ నుండి వచ్చిన ఇంజామామ్ మేనల్లుడు, పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ లాహోర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంజామామ్కు మద్దతు తెలిపాడు. 'టోర్నీ మొదటి ఐదు మ్యాచ్లలో జట్టు పేలవమైన ప్రదర్శనకు చీఫ్ సెలెక్టర్ను మాత్రమే నిందించడం సరికాదు. సెలక్షన్ కమిటీలో ఇతర సభ్యులు కూడా ఉన్నారు. కెప్టెన్, కోచ్ను సంప్రదించిన తరువాతే ఇంజామామ్ ఆటగాళ్లను ఎంపిక చేశాడు' అని ఇమామ్ అన్నారు.