భారత కెప్టెన్ 'రన్ మెషీన్' విరాట్ కోహ్లీ తన ట్విటర్లో ఓ ఫొటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అయింది. భారత అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకు ఆ ఫొటో ఏంటనుకుంటున్నారా. ప్రపంచకప్లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో కోహ్లీ వర్షం కోసం ఎదురు చూసే ఫొటో.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆ ఫొటోలో కోహ్లీ తన నడుముపై రెండు చేతులు పెట్టి వర్షం వస్తుందా? అని మబ్బులవైపు చూస్తున్నాడు. అయితే ఆరేడేళ్ల వయస్సులో ఉన్నప్పటి ఫొటోను ఆదివారం నాటి మ్యాచ్ ఫొటోతో జతచేసి కోహ్లీ ట్వీట్ చేసాడు. '1990ల నుంచి ఇదే చేస్తున్నా' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఆ ఫొటో ఇప్పుడు అభిమానులను ఎంతగానో ఆకట్టుకొంటోంది.
Doing it since the early 90s! 🤓 pic.twitter.com/IVitRHUWpW
— Virat Kohli (@imVkohli) June 17, 2019
పాకిస్థాన్తో మ్యాచ్లో వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. భారత ఇన్నింగ్స్ చివరలో, పాక్ ఇన్నింగ్స్ మధ్యలో వరణుడు ప్రత్యక్షమయ్యాడు. వరణుడు అడ్డుపడ్డా.. అనంతరం మ్యాచ్ కొనసాగి చివరకు ఫలితం వచ్చింది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (140; 113బంతుల్లో 14×4, 3×6) తనదైన బ్యాటింగ్తో పాక్ బౌలర్లపై విరుచుకుపడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రపంచకప్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత క్రికెటర్లకు రెండు రోజుల విశ్రాంతి లభించింది. టీమిండియా తన తర్వాతి మ్యాచ్ను శనివారం అఫ్గానిస్థాన్తో ఆడనుంది. మ్యాచ్కు మధ్యలో ఐదు రోజుల విరామం ఉండడంతో రెండు రోజులు ప్రాక్టీస్ నుంచి ఆటగాళ్లను మినహాయించాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది. దీంతో భారత ఆటగాళ్లు ఈ రెండు రోజుల్లో నచ్చిన చోట విహరించే అవకాశం కల్పించారు. భారత్ తన తదుపరి మూడు మ్యాచ్లను ఆఫ్గనిస్తాన్ (జూన్ 22), వెస్టిండీస్ (జూన్ 27), ఇంగ్లాండ్ (జూన్ 30)లతో ఆడనుంది. భారత్ మూడు మ్యాచ్లలో విజయం సాధిస్తే సెమీస్ చేరుకుంటుంది.