ఆటగాళ్లు ఇష్టమైన ఆహారరాన్ని తినొచ్చు. పిజ్జాలు, బర్గర్లు తింటే తప్పేంటి అని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు. ప్రపంచకప్లో భాగంగా ఆదివారం భారత్ చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత పాకిస్తాన్పై విమర్శల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో అయితే పాక్ ఆటగాళ్లపై మీమ్స్, జోక్స్ పేల్చుతున్నారు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ను అయితే ఓ ఆటాడుకుంటున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
పాక్ ఆటగాళ్ల ఫిట్నెస్, మ్యాచ్కు ముందు రోజు బయట షికార్లు చేశారంటూ ఆ దేశ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మ్యాచ్కు ముందు రోజు రాత్రి పిజ్జాలు, బర్గర్లు, ఐస్క్రీమ్లు తిన్నారు. ఎవరైనా ఆటగాళ్లు ఇలాంటి తిండి తింటారా? అని ఓ అభిమాని మండిపడ్డాడు. ఈ విమర్శలపై హర్భజన్ సింగ్ స్పందించాడు. 'క్రికెట్ ఆటగాళ్లు ఇష్టమైన ఆహారాన్ని తినొచ్చు. పిజ్జాలు, బర్గర్లు తింటే తప్పేంటి. పాక్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనకు వారి ఆహారమే కారణమని చెప్పడం సరికాదు' అని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
భారత్ మ్యాచ్కు ముందు రోజు షోయబ్ మాలిక్ తన భార్య సానియా మీర్జా కలిసి హుక్కా కేఫ్లో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. వీటిపై భజ్జీ మాట్లాడుతూ... 'ఆ వార్త నిజమో కాదో నాకు తెలియదు. ఒక వేళ మ్యాచ్ ముందు రోజు షికారు చేస్తే మాత్రం సరైంది కాదు. ఇక ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అదంతా అసత్యమనే అనుకుంటున్నా' అని హర్భజన్ పేర్కొన్నారు.
ఇక కీలక మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ మానేసి షోయబ్తో షికార్లు కొట్టడమేంటని పాక్ అభిమానులు సానియాపై విమర్శల దాడి మొదలెట్టారు. దీంతో సానియా ట్విట్టర్కు విరామం ప్రకటించింది. 'ట్విట్టర్లో దాడి అయిపోయిందా?. ఇంకా ఇతర సోషల్ మీడియాలలో ట్రోల్ చేయాలనుకుంటున్నారా. ఇక శాంతించండి. ఇది విరామ సమయం' అని సానియా రాసుకొచ్చారు.