మంచి క్రికెట్ ఆడాం:
భారీ సెంచరీ చేసిన రోహిత్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ... 'జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. గత మ్యాచ్ బాగా ఆడాలనుకున్నాం. వర్షంతో రద్దవడంతో నిరాశ చెందాం. ఈ రోజు మాత్రం మంచి క్రికెట్ ఆడాం. నేను ఔటైన తీరుకు అసంతృప్తి చెందా. ఆ షాట్ ఎంపిక నా నిర్ణయ లోపమే' అని రోహిత్ తెలిపారు.
|
డబుల్ సెంచరీ గురించి ఆలోచించలేదు:
'ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకున్నాక ఎక్కువ పరుగులు చేయాలి. మంచి భాగస్వామ్యం నెలకొల్పాక ఔటవడం సరైనది కాదు. నిజంగా చెబుతున్నా.. డబుల్ సెంచరీ గురించి ఆలోచించలేదు. ఇది బ్యాటింగ్ పిచ్. నా బ్యాటింగ్ ఇంకా కొనసాగించాలనుకున్నా. కానీ అలా జరగలేదు. వచ్చే మ్యాచులలో మరిన్ని ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తా. ప్రస్తుతం నా జీవితంలో మంచి రోజులు నడుస్తున్నాయి. నాకు కూతురు రాకతోనే ఇదంతా' అని రోహిత్ అన్నారు.
|
అద్భుతంగా వేసారు:
'రాహుల్ చాలా బాగా ఆడాడు. అతడు సమయం తీసుకున్నా.. ఆ పరిస్థితిలో అవసరమే. కొత్త బంతిని చూసి ఆడాడు. కొన్నిమంచి షాట్లు నన్ను ఆకట్టుకున్నాయి. అయితే రాహుల్ మంచి సమయంలో అవుట్ అయ్యాడు. మేము మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. పాక్ వ్యూహాలతో నేనేమి ఇబ్బంది పడలేదు. వారు బౌన్స్, షార్ట్ బంతులు వేసారు. తొలి 10 ఓవర్లు వారు అద్భుతంగా వేసారు' అని రోహిత్ కితాబిచ్చాడు.
షార్ట్ బంతులే నా బలం:
'ఇంగ్లండ్ పిచ్లపై ఒక్కసారి బ్యాట్స్మన్ కుదురుకుంటే బౌలర్లకు చాలా కష్టం. ఆరంభంలో బ్యాట్స్మన్ చిన్న తప్పు చేసిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కొన్ని మ్యాచ్లు, పరిస్థితులు కూడా బ్యాట్స్మెన్కు సవాల్గా నిలుస్తాయి. ఆరంభంలో షాట్స్ ఆడటం చాలా కష్టం. పాక్ బౌలర్లు బౌన్సర్, షార్ట్ బంతులను వేశారు. అయితే షార్ట్ బంతులే నా బలం. అందుకే బాగా ఆడాను' అని రోహిత్ చెప్పుకొచ్చారు.