
వన్డే ప్రపంచకప్లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ మరో కీలక వికెట్ చేజార్చుకుంది. క్రీజులో కుదురుకున్న హార్దిక్ పాండ్యాను కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఔట్ చేసాడు. శాంట్నర్ వేసిన 30.3వ బంతికి హార్దిక్ పాండ్య (32; 62 బంతుల్లో 2×4) భారీ షాట్ ఆడగా.. కెప్టెన్ విలియమ్సన్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారత్ 94 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అంతకుముందు రిషభ్ పంత్ (32; 56 బంతుల్లో 4×4) వికెట్ను కూడా చేజార్చుకుంది. శాంట్నర్ వేసిన 22.5వ బంతిని షాట్ ఆడిన పంత్.. గ్రాండ్హోమ్కి చిక్కాడు. ఇన్నింగ్స్ చక్కబడిందనుకున్న తరుణంలో పంత్ అనవసర షాట్కు యత్నించి ఔటవ్వడంపై డగౌట్లో ఉన్న కెప్టెన్ కోహ్లీతో సహా టీమ్ మేనేజ్మెంట్ అసహనం వ్యక్తం చేశారు.
కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ షాక్ ఇచ్చాడు. నాలుగు బంతులు ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ (1; 4 బంతుల్లో) ఒక్క పరుగు మాత్రమే చేసి కీపర్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో పేసర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన 2.4వ బంతిని ఆడే క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (1; 6 వికెట్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. విరాట్ సమీక్ష కోరినా.. ఫలితం లేకుండా పోయింది.
దీని నుంచి తేరుకోకముందే మాట్ హెన్రీ మరో షాక్ ఇచ్చాడు. హెన్రీ వేసిన 3.1వ బంతికి కేఎల్ రాహుల్ (1; 7 బంతుల్లో) ఔటయ్యాడు. కీపర్ టామ్ లేథమ్ అద్భుత క్యాచ్ పట్టాడు. దీంతో టీమిండియా 5 పరుగులకే కీలక మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇది చాలదన్నట్టు భాద్యతగా ఆడాల్సిన దినేష్ కార్తీక్ (6; 25బంతుల్లో) ఔట్ అయ్యాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో జేమ్స్ నీషమ్ సూపర్ క్యాచ్ పట్టడంతో కార్తీక్ పెవిలియన్ చేరాడు. అనంతరం పంత్, పాండ్యా కూడా పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ధోనీ (14), జడేజా (9)లు క్రీజులో ఉన్నారు. భారత్ 33 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.