రెండు ఓవర్లు మెయిడిన్:
భారత్, న్యూజిలాండ్ సెమీస్కు వేదికైన ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగిన అయిదు లీగ్ మ్యాచ్ల్లో టాస్ గెలిచిన జట్టే మ్యాచ్ కూడా నెగ్గింది. ఈ నేపథ్యంలో విలియమ్సన్ టాస్ గెలవగానే భారత అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే భారత బౌలర్లు అంచనాలను తలక్రిందులు చేశారు. భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రాలు తొలి రెండు ఓవర్లను మెయిడిన్ వేశారు. ఒక్క పరుగు వద్దే ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (1; 14 బంతుల్లో)ను బుమ్రా ఔట్ చేసి కివీస్కు షాక్ ఇచ్చాడు.
కెప్టెన్ ఇన్నింగ్స్:
మరో ఓపెనర్ హెన్రీ నికోలస్ (28; 51 బంతుల్లో 2×4)తో కలిసి కెప్టెన్ కేన్ విలియమ్సన్ (67; 95 బంతుల్లో 6×4) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఇద్దరు వేగంగా పరుగులు చేయలేకపోయినా.. ఆచితూచి ఆడాడు. 50 పరుగుల భాగస్వామ్యం అనంతరం ఓ అద్భుతమైన బంతితో నికోలస్ను జడేజా క్లీన్బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ (67నాటౌట్; 85 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి విలియమ్సన్ ఇన్నింగ్స్ ముందుకు నడిపాడు. ఈ క్రమంలోనే విలియమ్సన్ అర్ధ శతకం చేసాడు.
టేలర్ దూకుడు:
వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 65 పరుగులు జోడించారు. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ 29 ఓవర్లకు గానీ 100 పరుగులు దాటలేదు. మరోవైపు అర్ధ శతకం తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో చాహల్ బౌలింగ్లో విలియమ్సన్ ఔటయ్యాడు. 134 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో జేమ్స్ నీషమ్ (12; 18 బంతుల్లో 1×4) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత గ్రాండ్హోమ్ (16; 10 బంతుల్లో 2×4)తో కలిసి టేలర్ దూకుడుగా ఆడుతూ అర్ధ శతకం అందుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ ఊపందుకునే సమయంలో వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆగిపోయింది.