ప్రపంచకప్లో భాగంగా బుధవారం న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా చివరివరకు పోరాడి 18 పరుగుల తేడాతో ఓడింది. దీంతో ప్రపంచకప్లో భారత్ ప్రస్థానం సెమీస్తో ముగిసింది. సెమీఫైనల్లో కీలకం సమయంలో భారత మాజీ కెప్టెన్, వికెట్కీపర్ మహేంద్రసింగ్ ధోనీ రనౌట్ అవ్వడంతో మ్యాచ్ కివీస్ గెలిచింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
భారత్ విజయం అంచున ఉండగా.. ధోనీ అనూహ్యంగా రనౌట్ కావడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక ధోనీ చివరి ప్రపంచకప్ కాబట్టి అభిమానులు అందరూ కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా మ్యాచ్ కవరేజ్ చేస్తున్న ఫోటోగ్రాఫర్.. ధోనీ ఔట్ అయిన వెంటనే ఏడ్చినట్టు ఓ ఫోటో ట్రెండ్ అయింది.
అయితే అది ఫేక్ ఫోటో అని తేలింది. ఫోటోగ్రాఫర్ ఏడ్చింది నిజమే.. కానీ ధోనీ ఔటనప్పుడు మాత్రం కాదని తెలిసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆసియా ఫుట్బాల్ కప్లో ఖతార్తో జరిగిన మ్యాచ్లో ఇరాక్ ఓడిపోవడంతో ఆ దేశ ఫోటోగ్రాఫర్ ఏడ్చేశాడు. అప్పటి ఫోటోను కొందరు ఆకతాయిలు ధోనీ ఔటనప్పుడు ఏడ్చినట్టు నెట్టింట్లో పోస్ట్ చేశారు. అది తెగవైరల్ అవడంతో ధోనీ అభిమానులు తెగ షేర్ చేశారు. అసలు విషయం తెలిశాక ఆ పోస్ట్ చేసిన ఆకతాయిపై మండిపడుతున్నారు.
లక్ష్య ఛేదనలో భారత్ విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు కావాలి. ఈ దశలో ధోనీ, భువనేశ్వర్ క్రీజులో ఉన్నారు. ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్ మొదటి బంతిని ధోనీ సిక్స్ కొట్టాడు. రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతిని షాట్ ఆడిన ధోనీ.. రెండో పరుగుకు యత్నించగా కివీస్ ఫీల్డర్ మార్టిన్ గప్తిల్ విసిరిన డైరెక్ట్ త్రో బెయిల్స్కు తాకడంతో ధోనీ పెవిలియన్ చేరాడు.