బాధను తట్టుకోలేక:
కోల్కతా నగరానికి చెందిన శ్రీకాంత్ (33) అనే వ్యక్తి సైకిల్ షాపు యజమాని. శ్రీకాంత్ ధోనీకి వీరాభిమాని. బుధవారం న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్ను శ్రీకాంత్ తన మొబైల్ ఫోన్లో చూస్తున్నాడు. మ్యాచ్ చివరలో అనూహ్యంగా ధోనీ రనౌట్ అయ్యాడు. ఫోన్లో మ్యాచ్ చూస్తున్న శ్రీకాంత్.. బాధను తట్టుకోలేక గట్టిగా అరుస్తూ సృహ తప్పి పడిపోయాడు. పక్కనవారు వెంటనే శ్రీకాంత్ను ఖానుకుల్ ఆసుపత్రికి తరలించారు. అయితే గుండె పోటుతో అప్పటికే శ్రీకాంత్ మరణించినట్లు వైద్యులు దృవీకరించారు.
ఆసుపత్రికి తీసుకెళ్ళాం
'మేము శ్రీకాంత్ అరుపులు విని షాప్ దగ్గరికి వెళ్ళాం. అప్పటికే అతను నేలపై అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే శ్రీకాంత్ను ఆసుపత్రికి తీసుకెళ్ళాం. వైద్యులు పరీక్షించి అతను చనిపోయాడని ప్రకటించారు. శ్రీకాంత్కు ధోనీ అంటే చాలా ఇష్టం' అని పక్కనే ఉండే ఓ స్వీట్ షాప్ యజమాని తెలిపారు.
కీలక సమయంలో రనౌట్:
లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్ల దాటికి భారత బ్యాట్స్మన్ వరుసగా పెవిలియన్ చేరారు. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కొద్దిసేపు పోరాడినా.. చెత్త షాట్లు ఆడి ఔట్ అయ్యారు. 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో 4x4, 4x6)తో కలిసి ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1X6) వందకుపైగా భాగస్వామ్యం నెలకొల్పి భారత శిబిరంలో ఆశలు రేపాడు. ఈ సమయంలో భారీ షాట్ ఆడబోయిన జడేజా ఔట్ అయ్యాడు. అనంతరం గెలిపించే బాధ్యత ధోనీపై పడగా.. కీలక సమయంలో ఓ సిక్స్ బాదిన అనంతరం రనౌట్ అయ్యాడు. ఇది చూసిన అభిమాని గుండె పోటుతో మరణించాడు.