
ప్రపంచకప్లో భాగంగా గురువారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ను వరుణుడు అడ్డుకున్నాడు. నాటింగ్హామ్లో బుధవారం నుంచి వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ జరిగే ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం చిత్తడిగా మారింది. దీంతో కనీసం టాస్ కూడా పడకుండానే అంపైర్లు మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకూ ఒక్కో పాయింట్ కేటాయించారు. దీని కంటే ముందు పాకిస్థాన్-శ్రీలంక, దక్షిణాఫ్రికా-వెస్టిండీస్, శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్లు వర్షం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రపంచకప్ 2019 టోర్నీకి ముందు వరకు ప్రపంచకప్లో 402 మ్యాచ్లు జరిగితే.. అందులో టాస్ పడకుండా రద్దయిన మ్యాచ్లు కేవలం రెండు మాత్రమే. కానీ ఈ టోర్నీలో ఇప్పటిదాకా 19 మ్యాచ్లు జరగ్గా.. మూడు టాస్ పడకుండానే రద్దయిపోయాయి. మరో మ్యాచ్ ఆట ఆరంభమైన కాసేపటికి ఆగిపోయింది. ఏకంగా నాలుగు మ్యాచ్లు వర్షార్పణం కావడంతో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఐసీసీ, ఇంగ్లండ్పై జోకులు పేల్చుతున్నారు.
ఈ క్రమంలో బాలీవుడ్ 'బిగ్ బి', టీమిండియాకు వీరాభిమాని అమితాబ్ బచ్చన్ కూడా ట్విటర్ వేదికగా జోకు పేల్చారు. 'ప్రపంచకప్ను భారత్కు తరలించండి. మాకు వర్షం కావాలి' అని ట్వీటారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయింది. అమితాబ్, క్రికెట్ అభిమానులు తెగ షేర్ చేస్తూ తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు.
మరోవైపు అభిమానులు కూడా జోకులు పేల్చుతున్నారు. 'ఈ రోజటి మ్యాచ్లో టాస్ గెలిచి భారత్ స్మిమ్మింగ్ ఎంచుకుంది' అని ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. 'ఇంగ్లండ్లో క్రికెట్ ఆడాలంటే అండర్ వాటర్లో ఆడటం నేర్చుకోవాలి' అని మరో నెటిజన్ పోస్ట్ చేసాడు. 'ప్రపంచకప్, వర్షం రెండూ ఇంగ్లండ్ను వదలడం లేదు'.. 'టాస్ గెలిచిన వాతావరణం వర్షాన్ని ఎంచుకుంది'.. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు వర్షం నీటిని ఎత్తిపోసిన సిబ్బందికి ఇవ్వాలి' అని పోస్టులు పెడుతున్నారు.