భారీ ఏర్పాట్లు:
మాంచెస్టర్లో మరోకొద్ధి గంటల్లో జరగనున్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లండన్ వేదికగా జరుగుతోన్న నేపథ్యంలో అందరూ అక్కడికి వెళ్ళలేరు. కాబట్టి నగరంలోనే మ్యాచ్ వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు అభిమానుల క్రికెట్ క్రేజ్కు మరింత జోష్నిస్తూ నగరంలోని బడా రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్బులు, క్లబ్బులు, కాఫీ షాపులు ప్రత్యేక ఆఫర్లతో క్రికెట్ వినోదాన్ని పంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశాయి.
ప్రత్యేక స్క్రీన్లు, వంటకాలు:
'జయహో భారత్' అనే ప్రత్యేక స్క్రీన్లతో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలను అభిమానులు చూసేలా చర్యలు తీసుకుంటున్నారు. పలు రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్బులు నోరూరించే రుచులతో విభిన్నమైన వంటకాలను ప్రత్యేక ఆఫర్లతో నగరవాసులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాయి. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చేవారికి ప్రత్యేక వంటకాల మెనూను అందుబాటులో ఉంచామని వివిధ రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. రోజువారీ వంటకాలకు కొంచెం డిఫరెంట్గా అదనంగా రెండు రకాల బిర్యానీ రుచులు అందించనున్నారట. స్పెషల్ డీజే, పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారట. డ్రింక్స్ మీద కూడా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు.
పాతబస్తీలో ఫ్లెక్సీలు:
కమాన్ ఇండియా, విన్ ఫైనల్, టేక్ వరల్డ్కప్ అంటూ పాతబస్తీలో ఫ్లెక్సీలు వెలిశాయి. మదీనా సర్కిల్లోని మహ్మద్ క్యాప్ మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ ఇలియాస్ బుకారీ ఆధ్వర్యంలో నయాపూల్ బ్రిడ్జిపై ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్దే విజయం అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి క్రికెట్పై తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక భారత్ ఫైనల్ చేరుకుంటే ఈ నెల 14న పాతబస్తీ నుంచి గుర్రం బగ్గీతో ప్రదర్శన నిర్వహించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు.