
బర్మింగ్హామ్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ (109 బంతుల్లో 102; 15 ఫోర్లు) సాధించాడు. 106 బంతులను ఎదుర్కొన్న రోహిత్ శర్మ 15 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఇది మూడు సెంచరీ కాగా.. మొత్తంగా 25వ సెంచరీ కావడం విశేషం.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
తాజా సెంచరీతో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. భారత్ తరఫున ఒకే ప్రపంచకప్లో మూడు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్ రికార్డుల్లోకెక్కాడు. 2003 ప్రపంచకప్లో గంగూలీ నమీబియా, కెన్యా, దక్షిణాఫ్రికాపై సెంచరీలు బాది అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా దాదా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత ప్రపంచకప్లో రోహిత్ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లాండ్పై సెంచరీలు చేశాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఓపెనర్, 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జానీ బెయిర్స్టో (109 బంతుల్లో 111; 10 ఫోర్లు, 6 సిక్స్లు) సెంచరీ చేసాడు. మరో ఓపెనర్ జేసన్ రాయ్ (57 బంతుల్లో 66; 7 ఫోర్లు, 2 సిక్స్లు), ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (54 బంతుల్లో 79; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసాడు. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (109 బంతుల్లో 102; 15 ఫోర్లు) సెంచరీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (76 బంతుల్లో 66; 7 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 45; 4 ఫోర్లు) మెరిసినా.. టీమిండియా భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 31 పరుగుల తేడాతో ఓడింది. రోహిత్ సెంచరీ వృధా అయింది.