టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో బలిదాన్ చిహ్నం కలిగిన గ్లోవ్స్తో బరిలోకి దిగడం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆగ్రహం వ్యక్తం చేయగా.. భారత అభిమానులు మాత్రం ధోనీకి మద్దతుగా నిలిచారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
తాజాగా ఈ విషయంపై భారత ఆర్మీ స్పందించింది. ధోనీ తన గ్లోవ్స్పై 'బలిదాన్ చిహ్నాన్ని' ఉంచుకోవడం అతని వ్యక్తిగత విషయమని భారత ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. లెఫ్టినెంట్ జెనరల్ చెరిశ్ మాథ్సన్ మాట్లాడుతూ... 'ధోనీ గ్లోవ్స్ వివాదంపై భారత ఆర్మీ చెయ్యాల్సిందేమీ లేదు. అతనో గొప్ప ఆటగాడు. అతడి సొంత నిర్ణయానికే వదిలేస్తున్నాం' అని తెలిపాడు.
ధోనీ బలిదాన్ చిహ్నం ఉన్న గ్లోవ్స్ను ధరించేందుకు అనుమతించాలని బీసీసీఐ రాసిన లేఖని ఐసీసీ తిరస్కరించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. బలిదాన్ చిహ్నం ఉన్న గ్లోవ్స్ను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆటగాళ్లు ధరించే దుస్తులపై లేదా కిట్ లాంటి పరికరాలపై స్పాన్సర్ల స్టిక్కర్లు తప్ప మిగతా సందేశాలు, లోగోలు ఉండరాదు. వికెట్ కీపర్ గ్లోవ్స్ విషయంలోని ప్రామాణికాల ప్రకారం కూడా బలిదానం చిహ్నం సరైంది కాదని ఐసీసీ పేర్కొన్నది.
బలిదాన్ చిహ్నం గ్లోవ్స్ను ఐసీసీ తిరస్కరించడంతో.. ఈ రోజు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో ధోనీ అవే గ్లౌవ్స్తో బరిలోకి దిగినా, ఆ లోగో కనిపించకుండా టేప్ వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్ తొలి మ్యాచ్లో ఫెలుక్వాయోను స్టంపౌట్ చేయడం ద్వారా ఈ గ్లౌజ్పై ఉన్న లోగో అందరికంటా పడింది.