|
6 బంతుల్లో 16 పరుగులు:
చివరి ఓవర్లో అఫ్గాన్ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరం. కెప్టెన్ కోహ్లీ బంతిని మహ్మద్ షమీకి ఇచ్చాడు. అఫ్గానిస్తాన్ జట్టు కోసం ఒంటరి పోరాటం చేస్తున్న మహ్మద్ నబీ స్ట్రైకింగ్లో ఉన్నాడు. షమీ తొలి బంతిని యార్కర్ వేయబోయి ఫుల్టాస్ వేశాడు. ఆ బంతిని నబీ ఫోర్ బాదాడు. దీంతో ఒక్కసారిగా భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. బుమ్రా అయితే తీవ్ర అసహనానికి గురయ్యాడు. మరుసటి బంతిని నబీ డీప్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడాడు. సింగిల్ వచ్చే అవకాశం ఉన్నా తీయలేదు.
మహీ సూచనలు:
ఇక నాలుగు బంతుల్లో 12 పరుగులుగా సమీకరణం మారింది. దీంతో బౌలర్ షమీపై ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలోనే ధోనీ తన వ్యూహాన్ని అమలు చేశాడు. ధోనీ.. షమీ దగ్గరకు పరుగెత్తుకొచ్చి కొన్ని సూచనలు ఇచ్చాడు. అంనతరం ఫీల్డింగ్ మార్చుకున్న షమీ.. యార్కర్ సంధించాడు. దీన్ని నబీ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్యాండ్యా చేతిలో పడింది. భారత శిబిరంలో ఆనందం వెల్లువిరిసింది. మరుసటి రెండు బంతులను యార్కర్లతో అప్తాబ్ అలామ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్లను క్లీన్బౌల్డ్ చేసాడు. దీంతో అతడు ఈ ప్రపంచకప్లో హ్యాట్రిక్ తీయడంతో పాటు టీమిండియాకి విజయాన్ని అందించాడు.
|
వ్యూహాలు ధోనీకి కొత్తేమి కాదు:
ఏదేమైనా ధోనీ సలహా తర్వాతే షమీ బౌలింగ్లో మార్పు వచ్చింది. దీంతో ధోనీ విలువేంటో మరోసారి రుజువైంది. అభిమానులు హ్యాట్రిక్ క్రెడిట్ ధోనిదే అని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. జట్టు క్లిష్ట పరిస్థితిల్లో ఉన్నప్పుడు వ్యూహాలు రచించడం ధోనీకి కొత్తేమి కాదు. చాలా మ్యాచ్ల్లో బౌలర్లతో వ్యూహాలు రచించి బ్యాట్స్మెన్ను బోల్తా కొట్టించాడు.
మహీ చెప్పినట్లే:
మ్యాచ్ అనంతరం మహ్మద్ షమీ మాట్లాడుతూ... 'ప్రణాళిక చాలా సులభం. యార్కర్ బంతులు వేయమని మహీ భాయ్ సూచించారు. 'హ్యాట్రిక్ సాధించడానికి ఇదే గొప్ప అవకాశం. ఇప్పుడు ప్రణాళిక మార్చవద్దు. హ్యాట్రిక్ అరుదైన అవకాశం' అని మహీ చెప్పారు. అతను చెప్పినట్లే చేశాను అని మహ్మద్ షమీ తెలిపారు.