
ఫేవరేట్గా బరిలోకి దిగిన టీమిండియా
టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగిన టీమిండియా తన ఆరంభ మ్యాచ్లో ఆశించిన స్థాయిలోనే రాణించింది. రాబోయే మ్యాచ్ల్లో కూడా భారత జట్టు ఇదే ప్రదర్శన చేస్తే ఇక తిరుగుండదు. ఈ మెగా టోర్నీలో టీమిండియాకు అసలు సిసలైన సవాల్ ఆదివారం నాటి మ్యాచ్తో మొదలు కానుంది. ఈ వరల్డ్కప్ టైటిల్ ఫేవరెట్స్లో ఒకటిగా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించాలంటే టీమిండియా సమిష్టింగా రాణించాల్సి ఉంది.

వరల్డ్కప్కు ముందు ఆడిన ఐదు వన్డేల సిరిస్ను
ఆస్ట్రేలియాతో వరల్డ్కప్కు ముందు ఆడిన ఐదు వన్డేల సిరిస్ను టీమిండియా 3-2తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. అదే ఆత్మ విశ్వాసంతో ఆసీస్ ఆటగాళ్లు బరిలోకి దిగుతారు. మరోవైపు ఏడాదిపాటు నిషేధం అనంతరం జట్టులోకి వచ్చిన డేవిడ్ వార్నర్, స్మిత్ రాకతో ఆస్ట్రేలియా జట్టు మరింత పటిష్టంగా ఉంది. ఆప్ఘనిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేసి మంచి ఫామ్లో ఉన్నాడు.

టీమిండియా ఏవిధంగా నిలువరిస్తుందో
అత్యంత బలంగా ఉన్న ఆస్ట్రేలియాను టీమిండియా ఏవిధంగా నిలువరిస్తుందో చూడాలి మరి. ఆస్ట్రేలియా మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్, పాకిస్థాన్లతో తలపడనుంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ ఇప్పటికే రెండు మ్యాచ్లు నెగ్గి మంచి ఫామ్లో ఉంది. కివీస్ టీమిండియాకు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయని క్రికెట్ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

న్యూజిలాండ్తో పోరుని కోహ్లీసేన తేలిగ్గా
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో పోరుని కోహ్లీసేన తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఇక, ఈ వరల్డ్కప్కే హై ఓల్టేజ్ మ్యాచ్గా అభివర్ణిస్తోన్న భారత్-పాక్ మ్యాచ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లపై ఎంతో ఒత్తిడి ఉంటుంది.

టోర్నీకో హై ఓల్టేజ్ మ్యాచ్
అయితే ప్రస్తుత ఫామ్, గత రికార్డులు చూస్తే ఈ మ్యాచ్లో టీమిండియానే విజయం సాధించే అవకాశాలున్నాయి. అయితే, టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్లో 106 పరుగులకే కుప్పకూలిన పాక్ తర్వాత ఆతిథ్య ఇంగ్లాండ్కు షాకిచ్చింది. ఆ జట్టు ఎప్పుడెలా ఆడుతుందో తెలియదు. కాబట్టి పాకిస్థాన్ను తక్కువగా తీసుకోవడానికి వీల్లేదు. మొత్తంగా టోర్నీలో భాగంగా టీమిండియా ఆడబోయే మిగతా మూడు మ్యాచ్లు ఎంతో కీలకం కానున్నాయి.


Click it and Unblock the Notifications
