నాలుగో స్థానంలో విజయ శంకర్కి బదులు కేదార్ జాదవ్ను ఆడించాలి అని మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ అంటున్నారు. గత కొంత కాలంగా భారత్ బ్యాటింగ్ ఆర్డర్లోని నాలుగో స్థానంపై తీవ్ర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ స్థానంలో చాలా మందినే ప్రయోగించినా.. చివరకు తెలుగు తేజం అంబటి రాయుడు కుదురుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్, ఐపీఎల్-12లో రాయుడు అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇదే సమయంలో పంజాబ్ తరపున పరుగుల వరద పారిస్తూ కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచకప్ జట్టు నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ను బీసీసీఐ ఎంపిక చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్, ఆసీస్ మ్యాచ్లో రాహుల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఓపెనర్ ధావన్ గాయంతో టోర్నీ నుండి నిష్క్రమించడంతో రాహుల్ ఓపెనింగ్ బాధ్యత తీసుకున్నాడు. ఇక నాలుగో స్థానంలో శంకర్ ఆడినా.. అంతగా రాణించలేదు. దీంతో నాలుగు స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ తన అబిప్రాయాన్ని తెలిపాడు .
తాజాగా గైక్వాడ్ మాట్లాడుతూ... 'కేదార్ జాదవ్ బాగా ఆడగలడు. స్టైక్ రొటేట్ చేస్తూ పరుగులు చేస్తాడు. మంచి షాట్లు కొట్టగలడు. జాదవ్ను నాలుగో స్థానంలో ఆడించాలి' అని పేర్కొన్నాడు. 'దినేశ్ కార్తీక్ అనుభవం ఉన్న ఆటగాడు. ఫినిషనర్గా నిరూపించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పరుగులు చేయగల సత్తా అతడికి ఉంది. జాదవ్ తర్వాత కార్తీక్కే మంచి ఆప్షన్. యువ ఆటగాడు రిషబ్ పంత్ బ్యాటింగ్ బాగున్నా.. నాలుగో స్థానంలో ఎలా ఆడతాడో చెప్పలేను' అని అన్నారు.