బుమ్రా కీలకం:
ప్రపంచకప్ సెమీస్ సమరానికి ముందు అటు క్రికెటర్లు, ఇటు విశ్లేషకుల అంచనాలు జోరందుకున్నాయి. తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'టీమిండియా వరుస విజయాలను అందుకోవడంలో బుమ్రా కీలకంగా వ్యవహరించాడు. టీమిండియాకు బౌలింగ్లో అతడే ప్రధాన ఆయుధం. మిగతా బౌలర్లకు ఆదర్శంగా నిలిచే ప్రదర్శన చేస్తున్నాడు' అని శ్రీకాంత్ పేర్కొన్నారు.
బంతితో అద్భుతాలు చేయగలడు:
'బుమ్రా కొత్త బంతితో అతను అద్భుతాలు చేయగలడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టేస్తాడు. మధ్య ఓవర్లలో కీలక భాగస్వామ్యం నెలకొల్పుతున్న జోడీని కూడా విడదీయగల సత్తా ఉంది. ఇక డెత్ ఓవర్లలో అతడి ప్రదర్శన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే డెత్ ఓవర్లలోనూ అదే జోరు సాగిస్తున్నాడు. లీగ్ దశలో ఇంగ్లాండ్, శ్రీలంకతో మ్యాచ్ల్లో అదే నిరూపితమైంది' అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
ఫామ్లో రోహిత్:
ఓపెనర్ రోహిత్శర్మ ప్రదర్శన బాగుంది. టోర్నీలో ఇప్పటికే ఐదు సెంచరీలు సాధించి మంచి ఫామ్లో ఉన్నాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న రోహిత్ మొదటి పవర్ప్లేలో పరుగులు చేయకున్నా.. తర్వాత పుంజుకుంటాడు. చాలామంది ఆటగాళ్లు ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తారు. కానీ రోహిత్ నెమ్మదిగా ఇన్నింగ్ ఆరంభించినా.. చివర్లో ప్రమాదకరంగా మారతాడు. శ్రీలంకతో మ్యాచ్లోనూ ఇదే జరిగింది. కచ్చితంగా కప్ టీమిండియాదే' అని శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు.
డెత్ ఓవర్లలో అద్భుతం:
తాజాగా మీడియా సమావేశంలో సచిన్ కూడా బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. 'టీమిండియా సెమీఫైనల్కు చేరుకోవడానికి రోహిత్ శర్మ కృషికి సమానంగా బుమ్రా కూడా కష్టపడ్డాడు. వికెట్లు తీయడంలో కొంచెం ఇబ్బంది పడుతున్న బుమ్రా జట్టు విజయాల్లో మాత్రం తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో బుమ్రా బౌలింగ్ అద్భుతం. కీలక సమయాల్లో బంతిని అందుకుని ఫలితం రాబడుతున్నాడు' అని సచిన్ అన్నారు.
తొలి సెమీఫైనల్:
లీగ్ దశలో టీమిండియా 9 మ్యాచ్లు ఆడి 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. కేవలం ఇంగ్లండ్పై మాత్రమే ఓడిపోయింది. ఇక న్యూజిలాండ్తో జరగాల్సిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మరోవైపు న్యూజిలాండ్ ఆరంభంలో అదరగొట్టినప్పటికీ తర్వాత పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చేతుల్లో ఓడిపోయి 11 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. దీంతో మంగళవారం టేబుల్ టాపర్ టీమిండియాతో న్యూజిలాండ్ తలపడనుంది.