
ప్రపంచకప్ చూస్తుంటే బాధేస్తోంది. పాకిస్తాన్ ఈ టోర్నమెంటు నుంచి వైదొలగాల్సి వస్తోంది. దీనికి ఎవర్నీ బాధ్యుల్ని చేయలేం అని పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. ప్రపంచకప్ సమరం చివరి అంకానికి వచ్చింది. లీగ్ దశ మ్యాచ్లు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. ఇప్పటికే సెమీ ఫైనల్ నాలుగు బెర్తులు దాదాపు ఖరారు అయ్యాయి. ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్ అధికారికంగా సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాయి. ఇక నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్ పోటీలో ఉన్నా.. న్యూజిలాండ్ అనధికారికంగా సెమీ ఫైనల్ చేరింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రస్తుతం 9 పాయింట్లతో ఉన్న పాకిస్థాన్.. ఆఖరి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో నెగ్గితే పాక్ కూడా కివీస్తో సమంగా 11 పాయింట్లు సాధిస్తుంది. అయితే మెరుగైన రన్రేట్ను పరిగణనలోకి తీసుకుంటే.. న్యూజిలాండ్ ముందడుగు వేస్తుంది. కివీస్ను పాక్ వెనక్కునెట్టాలనుకుంటే.. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయడంతో పాటు బంగ్లాదేశ్ను కనీసం 316 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఇది అసాధ్యం కాబట్టి న్యూజిలాండ్దే బెర్త్.
తాజాగా అక్తర్ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ... 'ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్లో క్రికెట్ నాణ్యత తీవ్ర నిరాకు గురిచేస్తోంది. పరుగులు చేయడం చాలా సులభంగా మారిపోయింది. బౌలర్లకు ఏమాత్రం నాణ్యత లేదు. 1990, 2000ల కాలంలో ఉన్న మాదిరిగా పేస్, స్పిన్ బౌలర్లకు నాణ్యత లేకుండా పోయింది. మూడు పవర్ప్లేలు, రెండు కొత్త బంతులతో పరుగులు చేయడం చాలా సులభం అయింది' అని అక్తర్ పేర్కొన్నాడు.
'న్యూజిలాండ్ జట్టు ఏమాత్రం నాణ్యత లేకుండా చెత్తగా ఆడడం వల్లే ఓడిపోయింది. విండీస్పై జరిగిన మ్యాచ్తో మాకు తీవ్ర నష్టం జరిగింది. తర్వాత శ్రీలంకపై జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఇక ఆస్ట్రేలియాపై ఓడిపోయారు. ఈ మూడు మ్యాచ్లు పాకిస్తాన్కు నష్టం చేశాయి. పాకిస్తాన్ తనంత తానుగా సెమీస్లో చోటు కోల్పోయింది. దీనికి ఎవర్నీ బాధ్యుల్ని చేయలేం' అని అక్తర్ అన్నారు.