హైదరాబాద్: వరల్డ్కప్ ముంగిట సఫారీలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మే30న ఓవల్ వేదికగా ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న ఆరంభ మ్యాచ్కు సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ దూరమయ్యాడు. ఈ మేరకు దక్షిణాఫ్రికా కోచ్ ఒట్టిస్ గిబ్సన్ అధికారిక ప్రకటన చేశారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
35 ఏళ్ల డేల్ స్టెయిన్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరంభ మ్యాచ్కి ముందు ఓవల్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా కోచ్ తెలిపారు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2019 సీజన్లో డేల్ స్టెయిన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఆర్సీబీ తరుపున కేవలం రెండు మ్యాచ్లాడిన డేల్ స్టెయిన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకోవడంతో స్టెయిన్కు వరల్డ్ కప్ జట్టులో చోటు లభించింది. అయితే, తాజాగా ఆ గాయం మళ్లీ తిరగబెట్టడంతో ఆతిథ్య జట్టుతో జరగనున్న ఆరంభ మ్యాచ్కి దూరమయ్యాడు.
అయితే, జూన్ 2న బంగ్లాదేశ్తో జరగనున్న రెండో మ్యాచ్కి కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికా జూన్ 5న సౌతాంప్టన్ వేదికగా కోహ్లీసేనతో తలపడనుంది. అప్పటికల్లా డేల్ స్టెయిన్ పూర్తి స్థాయి ఫిట్నెస్తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
డేల్ స్టెయిన్ స్థానంలో ఆరంభ మ్యాచ్కి ప్రిటోరియస్ లేదా క్రిస్ మోరిస్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక, సఫారీలు పేస్ ఎటాక్గా కగిసో రబాడ, లుంగి ఎంగిడిలు ఎలాగూ ఉన్న సంగతి తెలిసిందే.