
హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్ శర్మపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికాపై రోహిత్ శర్మ చేసిన సెంచరీ అతడి వన్డే కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్గా కోహ్లీ అభివర్ణించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ "వరల్డ్కప్లో తొలి మ్యాచ్. ఒత్తిడి గనుక పరిగణనలోకి తీసుకొంటే రోహిత్ శర్మ కెరీర్లో ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇది. పేస్కు అనూలిస్తోన్న పిచ్పై బౌన్సర్లు ఎదుర్కోవడం ఎంత కష్టమో ఓ బ్యాట్స్మన్గా నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నెమ్మదిగా ఆడటం అంత తేలికకాదు" అని అన్నాడు.
"వన్డేల్లో చాలా సార్లు పరిస్థితుల్ని దాటుకుని ఆటగాళ్లు తమ సొంత శైలిలో ఆడుతుంటారు. అయితే, సపారీలతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ సంయమనంతో పాటు నిగ్రహంగా ఆడాడు. ఈ మ్యాచ్లో ఎంతో పరిణితి కనబర్చాడు. ఒకానొక సందర్భంలో ఆటను సైతం నియంత్రించాడు. భాగస్వామ్యాలు నెలకొల్పుతూ వికెట్లు పడుతున్న సమయంలో రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు" అని కోహ్లీ అన్నాడు.
ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగగా, బౌలింగ్లో బుమ్రా(2/35), చాహల్(4/51) మెరుపులు మెరిపించడంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా నిర్ణీత 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 144 బంతుల్లో 122(13 ఫోర్లు, 2 సిక్సులు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వన్డేల్లో రోహిత్కిది 23వ సెంచరీ. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 22 సెంచరీల రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు.