రోహిత్, కోహ్లీలపైనే ఆధారం:
గాయం కారణంగా ధవన్ దూరమైనప్పటి నుంచి భారత్కు ఆరంభం కరువైంది. ఇంగ్లండ్పై రోహిత్ శర్మ శతకం బాదినా.. రాహుల్ డకౌటయ్యాడు. వరుసగా ఐదు అర్ధ శతకాలతో విరాట్ దూకుడుమీదున్నాడు. మరోసారి రోహిత్, కోహ్లీల బ్యాటింగేనే భారత్ నమ్ముకుంది. అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయిన శంకర్ గాయం కారణంగా టోర్నీకి దూరం కాగా.. అతడి స్థానంలో తొలి మ్యాచ్ ఆడిన పంత్పై అంచనాల భారం మరీ ఎక్కువైంది. రాహుల్ను తిరిగి నాలుగుకు పంపించి పంత్తో ఓపెనింగ్ చేయించే అవకాశాలు కూడా ఉన్నాయి.
జాదవ్పై వేటు?:
భారత మిడిలార్డర్ ప్రదర్శనలో మార్పు మాత్రం రావడం లేదు. ముఖ్యంగా ధోనీ, జాదవ్ ఆటపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అఫ్ఘాన్, ఇంగ్లండ్లతో మ్యాచ్ల్లో స్లో ఇన్నింగ్స్ చర్చకు దారితీసింది. ధోనీ స్థానానికి ఢోకా లేకపోయినా.. జాదవ్పై వేటు పడేలా ఉంది. అతడి స్థానంలో హిట్టింగ్ చేయగల ఆల్రౌండర్ జడేజాను ఆడించే అవకాశాలున్నాయి.
జడేజా, భువనేశ్వర్లకు చోటు:
చిన్న బౌండ్రీలున్న ఎడ్జ్బాస్టన్లో స్పిన్నర్ల కంటే సీమర్లుంటేనే నయం. దీంతో మార్పులు తప్పకపోవచ్చు. పేసర్లు అంచనాలకు మించి రాణిస్తుండటం భారత్కు అనుకూలాంశం. బుమ్రా పరుగులు కట్టడి చేస్తుంటే.. షమీ వికెట్లు తీస్తున్నాడు. జాదవ్, చహల్ను తప్పించి జడేజా, భువనేశ్వర్లకు చోటు కల్పించే అవకాశాలు కనిపిసున్నాయి. కుల్దీప్ మాత్రం కొనసాగనున్నాడు.
బ్యాటింగ్ బలంగా.. బౌలింగ్ బలహీనంగా:
ప్రపంచకప్లో అడుగుపెట్టిన ప్రతీసారి ఏదో ఓ జట్టు అవకాశాలను దెబ్బతీయడం బంగ్లాకు అలవాటే. 2007లో మనకూ ఆ అనుభవం ఎదురైంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మంచి ప్రదర్శన చేసింది బంగ్లా. ప్రపంచ నంబర్వన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ మీద ఆ జట్టు ఆధారపడుతోంది. ఈ టోర్నీలో షకీబ్ (476 పరుగులు, 10 వికెట్లు) బంతి, బ్యాటుతో రాణిస్తున్నాడు. తమీమ్, లిటన్, షకీబ్, ముష్ఫికర్, సర్కార్, మహ్ముదుల్లాతో బ్యాటింగ్ బలంగా ఉంది. అయితే పేసర్లు తేలిపోతుండటం ఆ జట్టును కలవరపెడుతున్నది. కెప్టెన్ మొర్తజా, ముస్తఫిజుర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. మొసద్దిక్, మెహదీ, సైఫుద్దీన్ కూడా రాణించట్లేదు. ఇది మనకు కలిసొచ్చే అంశం.
ముఖాముఖి రికార్డు:
వన్డేల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు 35 మ్యాచ్ల్లో తలపడ్డాయి. 29 మ్యాచ్ల్లో భారత్, 5 మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ గెలిచాయి. మరో మ్యాచ్ రద్దయింది. ఇక ప్రపంచకప్లో ఈ రెండు జట్ల మధ్య 3 సార్లు పోరు జరిగింది. రెండుసార్లు భారత్, ఒకసారి బంగ్లాదేశ్ విజయం సాధించాయి.
పిచ్, వాతావరణం
ఆదివారం భారత్, ఇంగ్లండ్ ఆడిన పిచ్పైనే ఈ మ్యాచ్ జరగనుంది. ఇది పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. భారీ స్కోరుకు అవకాశం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. బౌండరీ దూరం తక్కువగా ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్ది పిచ్ సీమర్లకు అనుకూలంగా మారనుంది. ఈ మ్యాచ్కు వర్ష ప్రమాదం లేదు.
జట్లు (అంచనా):
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్/ రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్/ యుజువేంద్ర చాహల్, మొమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
బంగ్లాదేశ్: తమీమ్ ఇక్బల్, సౌమ్య సర్కార్, షకీబల్ హాసన్ , ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, మహ్మదుల్లా, మొసద్దెక్ హసన్, మెహిదీ హసన్, సైఫుద్దీన్, మష్రాఫె మోర్తజా, ముస్తాఫిజుర్ రెహమాన్.