
గెలవాల్సిన మ్యాచ్:
మ్యాచ్ అనంతరం బంగ్లా కెప్టెన్ మొర్తజా మాట్లాడుతూ... 'మేము గెలవాల్సిన మ్యాచ్ కానీ.. ఛేదించలేకపోయాం. మరో మంచి భాగస్వామ్యం (80-90 పరుగులు) నమోదైతే విజయం సాధించే వాళ్ళం. అదృష్టం కలిసిరాలేదు. ముస్తాఫిజుర్ మంచి ప్రదర్శన చేసాడు. టోర్నీ ప్రయాణం బాగుంది. షకీబ్ అల్ హసన్, ముష్ఫిక్ రహీమ్ అద్భుతంగా ఆడారు. వారి అసాధారణమైన ప్రదర్శనతో సంతోషంగా ఉన్నా' అని మొర్తజా తెలిపారు.

తమీమ్ను నిందించలేం:
'రోహిత్ శర్మ అద్భుత ఫామ్లో ఉన్నాడు. అలాంటి బ్యాట్స్మన్ క్యాచ్ చేజార్చడం నిరాశను మిగిల్చింది. కానీ మైదానంలో ఇవి సాధారణమే. తమీమ్ను నిదించలేం. మా తదుపరి మ్యాచ్ పాకిస్తాన్తో. ఆ మ్యాచులో కూడా విజయం సాదించేందుకు పోరాడుతాం. అభిమానుల మద్దుతు అద్భుతం' అని మొర్తజా చెప్పుకొచ్చారు.

క్యాచ్ మిస్:
టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ఆరంభించారు. జట్టు స్కోరు 19 పరుగుల వద్ద ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతికి మిడ్ వికెట్ మీదుగా రోహిత్ భారీ షాట్ ఆడాడు. అదే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న తమీమ్ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా కంట్రోల్ తప్పడంతో బంతి అతడి చేతుల్లో నుంచి చేజారింది. అనంతరం రోహిత్ చెలరేగి 90 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో సెంచరీని చేశాడు.

సెమీఫైనల్లోకి టీమిండియా:
ఈ మ్యాచ్లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. రోహిత్ శర్మ (104) రికార్డు సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (77) రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఛేదనలో బంగ్లా 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. షకీబ్ (66), సైఫుద్దీన్ (51 నాటౌట్) పోరాటం వృథా అయ్యింది. బుమ్రా 4, హార్దిక్ 3 వికెట్లు తీశారు. సెంచరీ చేసిన రోహిత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు. ఈ విజయంతో టీమిండియా ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.


Click it and Unblock the Notifications
