ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. ఈ రోజు మాకోసం న్యూజిలాండ్ గెలిచితీరుతుంది అని పాకిస్థాన్ కోచ్ మిక్కీ ఆర్థర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదివారం ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంలో పడ్డాయి. పాక్ తమ తదుపరి మ్యాచ్లో బంగ్లాపై గెలుపొందినా.. ఈ రోజు జరుగుతున్న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్లో కివీస్ గెలిస్తేనే పాక్ సెమీస్ చేరే అవకాశం ఉంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే పాక్ను దెబ్బతీసేందుకే భారత్.. ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిందని ఆ జట్టు మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ క్రీడాస్ఫూర్తిని పాటించలేదంటూ పాక్ మాజీ కెప్టెన్ వకార్ యునిస్ పరోక్షంగా విమర్శలు చేసాడు. ఈ నేపథ్యంలో తాజాగా పాక్ కోచ్ మిక్కీ ఆర్థర్ కూడా స్పందించాడు.
ఆర్థర్ మాట్లాడుతూ... 'భారత్ ఎలా ఆడాలన్న విషయాన్ని మేము కంట్రోల్ చేయలేం. ఇంగ్లాండ్, భారత్ మ్యాచ్ ఫలితం కోసం చివరివరకు ఎదురుచూశాం. టోర్నీలో నిలవాలంటే.. మాకు ముఖ్యమైన మ్యాచ్లో భారత్ ఓడిపోవడం నిరాశ కలిగించింది. అయినా ఈ రోజు మాకోసం న్యూజిలాండ్ గెలిచితీరుతుంది. ఒకవేళ కివీస్ ఓడిపోయి.. ఇంగ్లండ్ భారీ తేడాతో గెలుపొందినా మేము నెట్రన్ రేటుపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇది కష్టంతో కూడుకున్నదే' అని ఆర్థర్ పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం వకార్ యునిస్ మాట్లాడుతూ... 'నువ్వు ఎవరనేది ముఖ్యం కాదు. జీవితంలో నువ్ చేసేదే నువ్వు ఎవరు అనేది తెలుపుతుంది. పాకిస్తాన్ సెమీస్కు చేరుతుందో లేదో నాకు బాధ లేదు కానీ.. ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉంది. కొందరు ఛాంపియన్ల క్రీడాస్ఫూర్తిని పరీక్షించగా.. అది తీవ్రంగా విఫలమైంది' అంటూ #INDvsEND హ్యాష్ ట్యాగ్ను జోడించి ట్వీట్ చేశారు.
ప్రస్తుతం న్యూజిలాండ్తో ఇంగ్లండ్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిస్తే 12 పాయింట్లతో నేరుగా సెమీస్ చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఇంగ్లండ్ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడిపోతే.. పాక్ సెమీస్ చేరే అవకాశాలు మెరుగవుతాయి. మరోవైపు బంగ్లా చేతిలో పాక్ ఓడిపోతే.. ఇంగ్లండ్కు అవకాశం ఉంటుంది.