ఎలాంటి స్పష్టత లేదు:
ఐపీఎల్ సీజన్ 12లో కింగ్స్ లెవెన్ పంజాబ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు కేదార్ జాదవ్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. వెంటనే చికిత్స అందించినా.. అతను ఇంకా కోలుకోలేదు. మరోవైపు మే 23 వరకే జట్టులోని ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఉంది. దీంతో ప్రపంచకప్లో ఆడుతాడా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
సమాలోచనలో బీసీసీఐ:
జాదవ్ గాయంపై బీసీసీఐ ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టింది. జాదవ్ ఫిట్నెస్ గురించి రోజువారి రిపోర్టులను బీసీసీఐ పరిశీలిస్తుంది. మరోవైపు పూర్తి ఫిట్నెస్ సాధించని ఆటగాడిని ఇంగ్లాండ్ కు ఎలా తీసుకెళ్లారని బీసీసీఐకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జాదవ్ విషయంలో బీసీసీఐ సమాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
రాయుడికే అవకాశం:
ఒకవేళ జాదవ్ను పక్కన పెడితే.. మొదటగా అంబటి రాయుడినే ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే జాదవ్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండటంతో.. అతడి స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను తీసుకునే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జట్టులో ముగ్గురు ఆల్రౌండర్లు విజయ్, పాండ్యా, జడేజా ఉన్నారు. కాబట్టి మరో ఆల్రౌండర్ను తీసుకునే సాహసం చేయకపోవచ్చు. మిడిల్ ఆర్డర్ లో స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ను ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే పంత్ను మాత్రం సెలక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదట.