
మెగా టోర్నీ ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. లీగ్ దశ నుండి నిష్క్రమించిన ఆయా జట్ల ఒక్కో సీనియర్ ఆటగాడు తమ క్రికెట్ కెరీర్కు గుడ్బై చెబుతున్నారు. శుక్రవారం బంగ్లాతో మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ఆల్రౌండర్, సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వన్డే క్రికెట్కు గుడ్బై చెప్పాడు. తాజాగా తెలుగు తేజం, భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు కూడా క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్మన్ జేపీ డుమిని ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్కు వీడ్కోలు పలుకుతామని టోర్నీ ఆరంభానికి ముందే ప్రకటించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ నేపథ్యంలో డుమిని ఈ రోజు చివరి వన్డే మ్యాచ్ను ఆడబోతున్నాడు. ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా శనివారం మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ జేపీ డుమిని కేరీర్లో చిట్టచివరిది. ఈ మ్యాచ్ అనంతరం వన్డేలకు గుడ్బై చెప్పబోతున్నాడు. ఇక దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్కు కూడా ఈ మ్యాచే చివరిది. పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఘనంగా వీడ్కోలు పలకాలని డుప్లెసిస్సేన భావిస్తోంది.
డుమిని ఇప్పటిదాకా 198 వన్డేలు ఆడాడు. ఓల్డ్ ట్రాఫొర్డ్లో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో 199వది. 198 మ్యాచ్లల్లో 5103 పరుగులు చేసాడు. తాహిర్ ఇప్పటిదాకా 106 వన్డేలను ఆడాడు. ఓల్డ్ ట్రాఫొర్డ్లో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో 107వది. 106 మ్యాచ్లల్లో తాహిర్ 172 వికెట్లను పడగొట్టాడు. 2011, 2015 ప్రప్రపంచకప్లో డుమిని దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు, 2019 ప్రపంచకప్ మూడోది. పాకిస్తాన్లోని లాహోర్లో జన్మించి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన తాహిర్ 2011, 2015 ప్రపంచకప్లలో సౌతాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. 2019 ప్రపంచకప్ తాహిర్కు కూడా మూడోదే.
ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య చిట్టచివరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభమౌతుంది. దీనితో ప్రపంచకప్ టోర్నమెంట్లో లీగ్ దశ ముగిసిపోతుంది. ఈ నెల 9న మొదటి సెమీఫైనల్, 11న రెండో సెమీస్ మ్యాచ్ జరుగనున్నాయి. 14వ తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.