హైదరాబాద్: క్రికెట్లో ఐసీసీ పలు విప్లవాత్మక నిర్ణయాలకు నాంది పలకనుంది. ఇకపై మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో అనుచితంగా ప్రవర్తించే ఆటగాళ్లను బయటకు పంపే అధికారం అంపైర్లకు ఇవ్వనుంది. ఈ మేరకు బుధ, గురువారాల్లో అనిల్ కుంబ్లే నేతృత్వంలో సమావేశమైన ఐసీసీ క్రికెట్ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది.
ఇప్పటివరకు టెస్టుల్లో, వన్డేల్లో కొనసాగుతున్న డీఆర్ఎస్ విధానాన్ని ఇకపై టీ20ల్లో కూడా ఉపయోగించాలని కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ సాంకేతిక కమిటీ సిఫారసు చేసింది. డీఆర్ఎస్లో కీలక మార్పులతో పాటు.. నోబాల్ నిబంధనలపై కూడా కొత్త ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చింది.
వీటిని అక్టోబర్ 1న జరిగే ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదిస్తే వెంటనే అమల్లోకి వస్తాయి. కమిటీ సూచించిన ప్రతిపాదనల ప్రకారం...

* టీ20ల్లో డీఆర్ఎస్ అమల్లేదు. ఒక్క తప్పుడు నిర్ణయం పూర్తి మ్యాచ్నే మార్చేసే పరిస్థితి టీ20 ఫార్మాట్లో ఉంటుందని గతంలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ గట్టిగా వాదించాడు. దీంతో డీఆర్ఎస్ అమలుకు కమిటీ మొగ్గు చూపింది.
* మైదానంలో అనుచితంగా ప్రవర్తించే ఆటగాళ్లను బయటకు పంపే అధికారం అంపైర్లకు ఉండనుంది.
* పరుగు తీసే క్రమంలో బ్యాట్స్మెన్ క్రీజులో ఒకసారి బ్యాట్ ఆనిస్తే చాలు. ఆ తర్వాత ఫీల్డర్ విసిరిన బంతి వికెట్లకు తాకే సమయంలో బ్యాట్ గాల్లో ఉన్నా కూడా బ్యాట్స్మన్ రనౌట్ కానట్లే లెక్క.
* ఫీల్డ్ అంపైర్ ఇవ్వకున్నా.. రిప్లేల్లో నోబాల్గా తేలితే మూడో అంపైర్ దాన్ని నోబాల్గా ప్రకటించొచ్చు.
* ఆటగాళ్లు గాయం లేదా ప్రమాదానికి గురైన సందర్భాల్లో సబ్స్టిట్యూట్లకు అనుమతి లభిస్తుంది. ఇలాంటి సందర్భంలో సబ్స్టిట్యూట్గా దిగిన ఆటగాడు ఫీల్డింగ్తో పాటు, బ్యాటింగ్ బౌలింగ్ కూడా చేయొచ్చు.
* డీఆర్ఎస్లో ఇకపై 'అంపైర్ కాల్'కు జట్టు సమీక్ష వృథా కాదు. ఎల్బీ నిర్ణయంపై ఆటగాడు అప్పీల్కు వెళ్లినప్పుడు రివ్యూలో స్పష్టంగా తేలని సమయంలో అంపైర్ నిర్ణయానికే వదిలేసి అవుట్గా ప్రకటించడం జరుగుతుంది. దీన్నే అంపైర్ కాల్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇంతకుముందు సమీక్ష వృథా అయ్యేది. ఇక నుంచి అలా జరగదు. డీఆర్ఎస్లో ఈ నిబంధన అమల్లోకి వస్తే 80 ఓవర్ల తర్వాత కొత్తగా సమీక్ష అవకాశాలు కూడా ఇవ్వరు. అన్ని అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో కూడా డీఆర్ఎస్ అమల్లోకి రానుంది.