
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు వేదికలు ఖరారయ్యాయి. ఐసీసీ 2023, అలాగే 2025కు సంబంధించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లను ఏ స్టేడియంలో నిర్వహించబోయేది ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ను ఓవల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. 2023లో ఫైనల్ను లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా నిర్వహించాలని ఐసీసీ తొలుత భావించింది. అయితే తాజాగా ఆ వేదికను మార్చింది. ఇక 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ వేదికను మాత్రం లార్డ్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఇకపోతే ప్రస్తుతం ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో 84పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు 6మ్యాచ్లు గెలిచింది, 1 ఓడిపోయింది. మూడు డ్రా చేసుకుంది. 6మ్యాచ్లు గెలిచి 72పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. శ్రీలంక, భారత్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. మొట్టమొదటి WTC ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో కేన్ విలియమ్సన్ సారథ్యంలో న్యూజిలాండ్ టీం గెలుపొంది తొలి డబ్ల్యూటీసీ టెస్ట్ ఛాంపియన్గా నిలిచింది.
'వచ్చే సంవత్సరం ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను ఓవల్లో నిర్వహించడం పట్ల మేం సంతోషిస్తున్నాం. ఈ స్టేడియం మంచి చరిత్రను, అలాగే మంచి వాతావరణ కండిషన్లను కలిగి ఉంది. అందువల్ల ఇలాంటి మ్యాచ్ ఈ వేదికపై నిర్వహించడం సరైనది' అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ అన్నారు. 2025 ఫైనల్ మాత్రం లార్డ్స్ వేదికగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.