
హైదరాబాద్: దక్షిణాప్రికా జట్టుకు ఐసీసీ ఓ శుభవార్తను ప్రకటించింది. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్కు వెళ్లబోతున్న తరుణంలో ఆ జట్టుకు బలం చేకూర్చే ఆలోచన నుంచి అడ్డుతప్పుకుంది. ఆ టీమ్ బౌలర్ కగిసో రబాడ మూడో టెస్ట్ ఆడేందుకు ఐసీసీ అనుమతినిచ్చింది. ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను కావాలని ఢీకొట్టాడన్న ఆరోపణల నుంచి రబాడ బయటపడ్డాడు.
దీంతో అతనిపై ఉన్న రెండు టెస్ట్ మ్యాచ్ల నిషేధాన్ని ఐసీసీ ఎత్తేసింది. అయితే క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా మాత్రం విధించారు. రబాడ.. స్మిత్ను కావాలని ఢీకొట్టినట్లుగా తాను భావించడం లేదని, అందుకే అతనిపై నిషేదం ఎత్తివేస్తున్నట్లు జుడీషియల్ కమిషనర్ మైకేల్ హెరాన్ చెప్పారు.
రబాడ మాత్రం క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా వ్యవహరించాడని, సహచర ఆటగాడికి తగిన గౌరవం ఇవ్వలేదని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో అతనికి 25 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించడంతోపాటు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. మళ్లీ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘిస్తే ఏమవుతుందో రబాడకు తెలుసు అని కూడా మైకేల్ హెరాన్ చెప్పారు.
జుడీషియల్ కమిషన్ నిర్ణయాన్ని అంగీకరిస్తూ.. రబాడపై ఉన్న నిషేధాన్ని ఐసీసీ ఎత్తేసింది. మూడో టెస్ట్ మొదలయ్యేలోపే, అతి తక్కువ సమయంలోనే విచారణ పూర్తి చేసినందుకు మైకేల్ హెరాన్కు కృతజ్ఞతలు చెప్పింది. ఈ విషయంపై స్పందించిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ మాట్లాడుతూ.. 'హెరాన్ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తున్నాం. మూడో టెస్టు మొదలుకాబోతున్న తరుణంలో నిషేదం ఎత్తివేయడం సంతోషకరమైన విషయం' అని పేర్కొన్నారు.