చెన్నై: బిసిసిఐ మాజీ చీఫ్ ఎన్ శ్రీనివాసన్కు తన 'గే' కొడుకు నుంచి దిగ్ర్భాంతికర సంఘటన ఎదురైంది. వారసుడి కోసం ఓ మహిళను వివాహం చేసుకోవాలని తనపై తన తండ్రి శ్రీనివాసన్ ఒత్తిడి చేస్తున్నాడని అతని కొడుకు ఆరోపించారు. అంతేగాక, బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు.
డిఎన్ఏకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీనివాసన్ కొడుకు అశ్విన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. తాను ఒక గే అని చెప్పుకున్నారు. తాను తన పురుష భాగస్వామితో సహజీవనం చేస్తున్నానని.. అయితే తన తండ్రి మాత్రం ఓ మహిళను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని అశ్విన్ శ్రీనివాసన్ తెలిపారు.
తన భాగస్వామి అవి ముఖర్జీతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం తన తండ్రికి తెలిసిందని చెప్పారు. ' మేము మా ఇష్టం మేరకు కలిసి జీవిస్తున్నాం. మా బంధానికి విరుద్ధంగా నా తండ్రి వ్యవహరిస్తున్నారు. నన్ను వేధింపులకు గురిచేస్తున్నారు. నేను అవితో విడిపోయి.. ఓ మహిళను పెళ్లి చేసుకుని తన కుటుంబానికి వారసులను కనాలని ఒత్తిడి చేస్తున్నారు' అని అశ్విన్ శ్రీనివాసన్ చెప్పారు.

తాను తండ్రి ఆస్తిలో భాగం కావాలని అడుగుతున్నానని, ఆ ఆస్తి పంచితే తాను తన అవితో కలిసి జీవిస్తానని అశ్విన్ తెలిపారు. తమ బంధాన్ని వ్యతిరేకిస్తూ తనకు తన తండ్రి రాసిన లేఖలను కూడా చూపించారు అశ్విన్.
జూన్ 20, 2007లో రాసిన ఓ లేఖను అశ్వన్ చదివారు. 'అశ్.. నువ్వు నా ఒక్కగానొక్క కొడుకువి. నువ్వు, మీ తల్లి అంటే నాకెంతో ఇష్టం. నేను నీకోసం ఉంటానని నీకు తెలుసు. అందుకే నీకు సూచిస్తున్నా. 'నేను నీకు అవసమైన సహాయం చేస్తాను' 'నేను ఎంతో కష్టడి డబ్బును సంపాదించాను' అని తన తండ్రి రాసిన లేఖను చదివారు.
'నేను శ్రమించి సంపాదించిన సొమ్ము నా రక్తం పంచుకు పుట్టిన వారికే వస్తుంది. నేను కొత్త వారికి ఎవరికీ ఇవ్వలేను. అందుకే నువ్వు ఒక యువతిని పెళ్లి చేసుకుని వారసుడ్ని మన కుటుంబానికి వారసుడ్ని ఇవ్వు' అని ఆ లేఖలో తన తండ్రి పేర్కొన్నట్లు అశ్విన్ తెలిపారు. లేఖలకు తాను మారకపోవడంతో తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడని చెప్పారు.
ఈ విషయంపై మీడియా శ్రీనివాసన్ను ప్రశ్నించగా.. 'ఇది మా వ్యక్తిగత విషయం. తండ్రీ కొడుకుల మధ్య ఎన్నో విషయాలుంటాయి. నేను వాటి గురించి ఎందుకు మాట్లాడాలి. నేను ఈ విషయంలో ఏమి మాట్లాడలేను' అని తెలిపారు.