హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నానని పాకిస్థాన్ క్రికెటర్ హారిస్ సోహైల్ తెలిపాడు. ఉమర్ అక్మల్ ఫిట్నెస్ పరీక్షలో విఫలం కావడంతో అతడి స్థానంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే పాకిస్థాన్ జట్టులో సోహైల్ని పీబీసీ ఎంపిక చేసింది.
బర్మింగ్హామ్లో నిర్వహించిన ముందస్తు ఫిట్నెస్ పరీక్షల్లో అక్మల్ విఫలమయ్యాడు. దీంతో అక్మల్ను ఇంగ్లాండ్ నుంచి అర్ధంతరంగా వెనుక్కి పిలిపించారు. అనంతరం నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో కూడా అతడు ఫెయిలవ్వడంతో అతన్ని జట్టు నుంచి తప్పించారు.
ఆ తర్వాత ఇంజమాముల్ హక్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ ఉమర్ అమిన్, సొహైల్, ఆసిఫ్ జకిర్లను లాహోర్లోని జాతీయ అకాడమీలో ఫిట్నెస్ టెస్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. అనంతరం ట్రైనర్ ఇచ్చిన నివేదిక ప్రకారం సొహైల్ను ఉమర్ అక్మల్ స్థానంలో ఎంపిక చేసినట్లు పీసీబీ పేర్కొంది.
ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో భాగంగా ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో పాకిస్థాన్ జట్టు ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. 28 ఏళ్ల 2015 మేలో జింబాబ్వే పర్యటనలో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తిరిగి మళ్లీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టడంతో సంతోషం వ్యక్తం చేశాడు.
'జట్టు విజయం కోసం నా శాయశక్తులా కృషి చేస్తాను. ప్రతి ఆటగాడు కూడా భారత్పై బాగా ఆడాలని కోరుకుంటాడు. భారత్తో మ్యాచ్లో నాకు ఆడేందుకు అవకాశం వస్తే.. తప్పకుండా నా ఉత్తమ ఆటతీరు చూపేందుకు ప్రయత్నిస్తా' అని సోహైల్ ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రికతో చెప్పాడు.
పాక్ తరుపున 22 వన్డే మ్యాచ్లాడిన హారిస్ 82.26 స్ట్రయిక్ రేట్తో 774 పరుగులతో పాటు నాలుగు వికెట్లు తీశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 4వ తేదీన బర్మింగ్హామ్ వేదికగా జరగనుంది.
టీమిండియా గ్రూప్ బీలో ఉంది. పాక్ మ్యా్చ తర్వాత దక్షిణాఫ్రికా, శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పాల్గొంటున్నాయి. జూన్ 1 నుంచి 18 వరకు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ అతిథ్యమిస్తోంది.