హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైసవం చేసుకుని స్వదేశానికి చేరుకున్న పాకిస్థాన్ జట్టుకు ఆ దేశంలో ఘన స్వాగతం లభించింది. ఓవల్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్పై పాకిస్థాన్ ఘన విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
సర్ఫరాజ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ నుంచి నేరుగా మంగళవారం ఉదయం కరాచీకి చేరుకుంది. తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన పాక్ క్రికెట్ జట్టుని చూసేందుకు, అభినందించేందుకు పిల్లలు, పెద్దలు విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఫైనల్లో భారత్పై పాకిస్థాన్ను గెలిపించిన కెప్టెన్ సర్ఫరాజ్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రత్యేక మేళతాళాలతో స్థానికులు ఆటగాళ్లకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కెప్టెన్ సర్ఫరాజ్కి ప్రత్యేక టోపీ, శాలువాను బహుకరించారు. ఓపెన్ టాప్ జీపులో సర్ఫరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీని చేత పట్టుకుని అభిమానులకు అభివాదం చేసుకుంటూ కరాచీలో ఉన్న తన ఇంటి వద్దకు చేరుకున్నాడు. సర్ఫరాజ్ను చూసేందుకు అభిమానులు సమీపంలోని ఇళ్లు, బాల్కనీలను సైతం ఎక్కారు.
ఈ సందర్భంగా సర్ఫరాజ్ మాట్లాడుతూ 'అభిమానులందరికీ ధన్యవాదాలు. అల్లా మన ప్రార్థనలు ఆలకించాడు' అని అన్నాడు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది.
అనంతరం 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసిన ఆలౌటైంది. దీంతో భారత్పై 180 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.