హైదరాబాద్: టీమిండియా ఆటగాళ్లు యువరాజ్సింగ్, జహీర్ఖాన్ల మధ్య ట్విట్టర్లో చోటు చేసుకున్న ఆసక్తికర సంభాషణను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్లు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
మైదానం బయట లోపల వీరిద్దరి మధ్య చక్కటి అనుబంధం ఉంది. గోవాలో జరిగిన యువరాజ్ పెళ్లికి జహీర్ ఖాన్ హాజరవడం అలాగే బాలీవుడ్ నటి సాగరికతో జహీర్ ఖాన్ ఎంగేజ్మెంట్కి యువరాజ్ సింగ్ హాజరైన సంగతి తెలిసిందే.

తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్పై జహీర్ ఖాన్ ఓ ట్వీట్ చేశాడు. పాక్కు 90 బాల్స్లో 62 రన్స్ అవసరం.. ఇంకా మూడే వికెట్లున్నాయి.. ఏం జరుగుతుందో చూడాలి అన్నది ఆ ట్వీట్ సారాంశం.
ఈ ట్వీట్ చూసిన యువీ వెంటనే స్పందించాడు. జహీర్ భాయ్ ఏంటీ ఈ మధ్య ట్వీట్స్ ఎక్కువ చేస్తున్నావ్ అని యువరాజ్ మరో ట్వీట్ చేశాడు.
దీనికి జహీర్ ఖాన్ తనదైన శైలిలో ట్విట్టర్లో స్పందించాడు. "నేను నీలా ట్వీట్స్ చేస్తున్నాను గానీ.. నువ్వేంటి మరీ నాలాగా ఫీల్డింగ్ చేస్తున్నావ్" అంటూ జహీర్ చేసిన ట్వీట్ క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనికి యువరాజ్ ఇంకా సమాధానమివ్వలేదు. జట్టు సహచరులతో ఎప్పుడూ సరదాగా ఉంటూ వాళ్లను ఆటపట్టించే యువరాజ్... జహీర్కు ఏ సమధానం ఇస్తాడోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.