హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యనటలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో క్రికెటర్లు ఏ మాత్రం ఖాళీ దొరికినా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. లంకతో ఓటమి తర్వాత దక్షిణాఫ్రికాతో మ్యాచ్కు ముందు దొరికిన విరామంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని తన భార్య సాక్షి, కుమార్తె జివాతో కలిసి ఎంజాయ్ చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
దీనికి సంబంధించిన ఫోటోలను ధోని తన భార్య సాక్షి 'ఫ్యామిలీ టైమ్' అంటూ తన ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేసింది. టోర్నీలో భాగంగా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై 124 పరుగుల తేడాతో గెలిచిన కోహ్లీసేన ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్లతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్లో ధోని 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. వన్డే కెరీర్లో ధోనికి ఇది 62వ అర్ధ సెంచరీ. ఈ మ్యాచ్లో రెండు సిక్స్లు కొట్టిన ధోని విదేశీ గడ్డపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్ మెన్గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు మాజీ కెప్టెన్ గంగూలీ పేరిట ఉండేది.
కాగా, 49.2వ ఓవర్లో చండీమాల్ బౌలింగ్లో ధోనీ అవుటైన సంగతి తెలిసిందే. 296 మ్యాచ్లాడిన గంగూలీ 159 సిక్సర్లు బాదగా, 281 మ్యాచ్ల్లోనే ధోని 161 సిక్స్లతో ఆ రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెటర్ అఫ్రిది 402 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే టీమిండియా సెమీస్కు చేరుకుంటుంది.