హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్కి రెండో మ్యాచ్లో ఊహించని షాక్ తగిలింది. ఓవల్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో బ్యాట్స్మెన్ చెలరేగినా.. బౌలర్లు తేలిపోవడంతో శ్రీలంక చేతిలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది.
322 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 48.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది. ఛేదనకు దిగిన శ్రీలంకను కట్టడి చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. శ్రీలంక ఓపెనర్ గుణతిలక (76; 72 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు), కుశాల్ మెండిస్ (89; 93 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సు) అర్ధ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
చివర్లో పెరెరా (47; 44 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్ మాథ్యూస్ (52 నాటౌట్; 45 బంతుల్లో 6 ఫోర్లు), గుణరత్నే (34 నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు)తో రాణించి గెలుపు లాంఛనాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే 322/3తో పూర్తి చేశారు. ఈ ఓటమితో సెమీఫైనల్ అవకాశాల్ని భారత్ సంక్లిష్టం చేసుకుంది.
టోర్నీలో నిలవాలంటే దక్షిణాఫ్రికాతో ఆదివారం జరగనున్న మ్యాచ్లో భారత్ తప్పక గెలవాల్సి ఉంటుంది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్ (125; 128 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సు)తో పాటు మరో ఓపెనర్ రోహిత్ శర్మ (78; 79 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు), మహేంద్రసింగ్ ధోనీ (63; 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధ సెంచరీలతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది.
ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు చక్కటి శుభారంభం లభించింది. ఓపెనర్లు ధావన్, రోహిత్ నిలకడగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధ సెంచరీలు నమోదు చేశారు.
వీరిద్దరూ తొలి వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధికంగా 50కి పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన క్రిస్గేల్, చందర్పాల్ రికార్డుని బద్దలు కొట్టారు. ఆ తర్వాత జట్టు స్కోరు 139 పరుగుల వద్ద కోహ్లీ డకౌట్ గా వెనుదిరిగాడు.
అనతంరం జట్టు స్కోరు 179 పరుగుల వద్ద యువీ (7) పెవిలియన్కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని సాయంతో శిఖర్ ధావన్ అద్భుతమైన షాట్లతో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. తన 77వ ఇన్నింగ్స్లో 10వ అర్ధ సెంచరీని సాధించాడు. తద్వారా కోహ్లీ (80 ఇన్నింగ్సుల్లో) సాధించిన రికార్డు చెరిపేశాడు.
మరోవైపు అత్యధిక వేగంగా 10 సెంచరీలు చేసిన మూడో క్రికెటర్గా ధావన్ అవతరించాడు. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీలో మూడవ సెంచరీ చేసి గంగూలీ, గిబ్స్, గేల్ సరసన నిలిచాడు. ట్రోఫీలో 7 ఇన్నింగ్స్ల్లో 500కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించి గంగూలీ (8 ఇన్నింగ్స్ల్లో)ని సైతన అధిగమించాడు.
ఈ క్రమంలో శిఖర్ ధావన్ 125 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మలింగ్ బౌలింగ్లో మెండిస్కు క్యాచ్ ఇచ్చిన పెవిలియన్కు చేరాడు. దీంతో టీమిండియా జట్టు స్కోరు 261 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ధావన్-ధోనిలు నాలుగో వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
చివర్లో కేదార్ జాదవ్ (25; 13 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సు)తో రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 322 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.
భారత్ Vs శ్రీలంక మ్యాచ్ హైలెట్స్:
* ఈ మ్యాచ్కు ఓ ప్రత్యేకత ఉంది. ఇది భారత్, శ్రీలంక ఆడుతున్న 150వ అంతర్జాతీయ వన్డే కావడం విశేషం.
* టీమిండియా 83 మ్యాచుల్లో గెలవగా లంకేయులు 54 మ్యాచుల్లో విజయం సాధించారు. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఫలితం తేలని మ్యాచ్లు 11 ఉన్నాయి.
* అంతర్జాతీయ క్రికెట్లో రెండు దేశాలు 150 వన్డేల్లో తలపడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
* మలింగ వేసిన తొలి ఓవర్లో తొలి బంతిని భారత ఓపెనర్ రోహిత్ శర్మ బౌండరీగా మలిచాడు.
* మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తాను ఎదుర్కొన్న తొలి బంతిని బౌండరీగా మలిచాడు.
* 2015 వరల్డ్ కప్ తర్వాత ధావన్-రోహిత్ శర్మల జోడీ అత్యధిక భాగస్వామ్య యావరేజి (55.10) నమోదు చేసిన జోడీగా అవతరించింది.
* తొలి పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా టీమిండియా 48 పరుగులు చేసింది.
* ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్-శిఖర్ ధావన్ల జోడీ వరుసగా సెంచరీ భాగస్వామ్యాలను నమోదు చేసింది.
* 60 బంతుల్లో రోహిత్ శర్మ తన కెరీర్లో 31వ అర్ధ సెంచరీని సాధించాడు.
* బౌండరీతో శిఖర్ ధావన్ తన కెరీర్లో 19వ అర్ధ సెంచరీని సాధించాడు.
* తొలి వికెట్కు టీమిండియా 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ (78) వద్ద అవుటయ్యాడు.
* 26వ ఓవర్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్గా వెనుదిరిగాడు. 2014 తర్వాత మళ్లీ లంకతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ డకౌట్ అయ్యాడు.
* 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువరాజ్ సింగ్ మూడో వికెట్గా అవుటయ్యాడు.
* టోర్నీలో అత్యంత వేగంగా 500 (7 ఇన్నింగ్సుల్లో) పైచిలుకు పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా ధావన్ రికార్డు సృష్టించాడు. గంగూలీ 8 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించడం విశేషం.
* ఇక శ్రీలంకపై వరుసగా ఐదు వన్డేల్లో 50కి పైగా పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు.
* ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ మూడో సెంచరీని సాధించాడు. మొత్తంగా తన కెరీర్లో 10వ సెంచరీ. ఈ సెంచరీని బౌండరీతో సాధించాడు.
* ఐసీసీ టోర్నీల్లో శిఖర్ ధావన్కు ఇది 5వ సెంచరీ.
* దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డీ కాక్(55 ఇన్నింగ్స్), హషీం ఆమ్లా(57 ఇన్నింగ్స్)ల తర్వాత అత్యంత వేగంగా 10 సెంచరీలు సాధించిన ఆటగాడిగా ధావన్(77 ఇన్నింగ్స్లలో) నిలిచాడు. రికార్డు సృష్టించాడు.
* ఛాంపియన్స్ ట్రోఫీలో ఎక్కువ సెంచరీలు సాధించిన ఆటగాళ్లు: 3-ధావన్(7ఇన్నింగ్స్ లు), 3-గిబ్స్(10), 3-గంగూలీ(11), 3-క్రిస్ గేల్(17).
* 125 పరుగుల వద్ద శిఖర్ ధావన్ పెవిలియన్కు చేరాడు.
* నాలుగో వికెట్కు ధోనితో కలిసి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
* వన్డేల్లో ధోని 62వ అర్ధసెంచరీని సాధించాడు. కాగా, లంకపై 19వ అర్ధ సెంచరీ.
* ధోని 52 బంతుల్లో 63 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు.
* చివర్లో బ్యాటింగ్కు దిగిన కేదార్ జాదవ్ 13 బంతుల్లో 25 పరుగులు చేశాడు.
* భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో 5వ ఓవర్ నాలుగో బంతికి తొలి వికెట్ తీశాడు. 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓపెనర్ డిక్వెల్ల జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
* అర్ధ సెంచరీని చేసిన గుణతిలక 76 పరుగుల వద్ద అవుటయ్యాడు.
* కుశాల్ మెండిశ్ తన కెరీర్లో 11వ అర్ధ సెంచరీని సాధించాడు.