బీసీసీఐ దెబ్బకు పాకిస్థాన్ పీకల్లోతు కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశం నెలకొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీమిండియాను పాకిస్థాన్కు ఎట్టిపరిస్థితుల్లో పంపించమని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది.
వన్డే ఫార్మాట్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. గతేడాది ఆసియా కప్ను నిర్వహించిన తరహాలోనే ఈ మెగాటోర్నీని నిర్వహించాలని పేర్కొంటుంది. గత ఆసియా కప్కు పాకిస్థానే ఆతిథ్యం ఇచ్చింది. భారత్ మ్యాచ్లన్నీ శ్రీలంక వేదికగా జరిగాయి. మరోవైపు టీమిండియాను తమ దేశానికి రప్పించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పట్టుబట్టుతోంది.

ఐసీసీపై ఒత్తిడి తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ అధికారిక షెడ్యూల్ ఇప్పటికీ ఖరారు కాలేదు. అయితే పాకిస్థాన్ వెళ్లేదిలేదని బీసీసీఐ స్పష్టం చేయడంతో హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించాలని ఐసీసీ యోచిస్తోంది. పీసీబీని ఒప్పించేలా ఐసీసీ చర్యలు చేపడుతోంది. అయితే పాకిస్థాన్ హైబ్రిడ్ మోడ్కు ఒప్పుకోకుండా, టోర్నీ నిర్వహణ నుంచి తప్పుకుంటే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.
పాక్ బోర్డుకు ఐసీసీ అందించే విధుల్లో కోత విధించే అవకాశముంది. ఇక టోర్నీ నిర్వహణ మరో దేశానికి తరలించినా లేదా వాయిదా వేసినా ఆతిథ్య ఫీజు కింద దక్కాల్సిన సుమారు రూ.548 కోట్లు రాకుండా పాకిస్థాన్ నష్టపోయే అవకాశం ఉంటుంది. కాగా, నిర్వహణలో భాగంగా ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ పాకిస్థాన్కు పంపింది. గురువారం ఇస్లామాబాద్కు ట్రోఫీ చేరకుంది. వచ్చే వారంలో పాక్ అంతటా ట్రోఫీని తీసుకెళ్తారు. డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది.
కాగా, 1996 తర్వాత తొలిసారి ఐసీసీ ఈవెంట్కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది. 2008 ముంబయి దాడుల అనంతరం భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించని విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఆసియా కప్ వంటి టోర్నీల కోసం టీమిండియా తమ దేశానికి రావాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్నిసార్లు విన్నవించినా బీసీసీఐ అంగీకరించలేదు.