కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్తున్నాడా? ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఉత్సుకత, ఆసక్తి రేపుతోన్న ప్రశ్న ఇది. చాలా మంది క్రికెట్ ప్రియుల్లో ఈ విషయంపై భారీ స్థాయిలో ప్రశ్నలో మెదులుతున్నాయి. అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. అసలు ఈ ప్రశ్న ప్రస్తుతం అందరి మదిలో ఎందుకు తిరుగుతోందంటే?
కెప్టెన్ల ఫొటోషూట్
సాధరణంగా ఏదైనా ఐసీసీ ఈవెంట్ టోర్నీ జరిగినప్పుడు, అందులో పాల్గొనే ఆయా జట్ల కెప్టెన్లతో ఓ బిగ్ ఈవెంట్ ను నిర్వహిస్తుంటారు. హోస్ట్ కంట్రీలో సారథులు అంతా ఓ చోట జేరి ప్రెస్ కాన్ఫరెన్స్ పాల్గొని ఫొటోషూట్ లో పాల్గొంటారు. ట్రోఫీని పట్టుకుని కెప్టెన్లంతా కలిసి గ్రూప్ ఫొటో దిగుతారు. ఇక ఇదే ఈవెంట్ లో తమ జట్ల గురించి, వారి అంచనాల గురించి మాట్లాడుతారు. అలానే ఈ సారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను ఐసీసీ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జరగబోయే కెప్టెన్ల ఫొటోషూట్ సమావేశంలో టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొంటాడా? లేదా?, ఇందుకోసం పాకిస్థాన్ వెళ్తాడా? లేదా? అనే ప్రశ్న ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

వెళ్తే సంచలనమే
ఒకవేళ నిజంగానే రోహిత్ శర్మ ఫొటోషూట్ కోసం పాకిస్థాన్ కు వెళ్తే అది సాహసోపేత పర్యటనే అవుతుంది. ఎందుకంటే దాయాది దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా అటు దౌత్యపరంగా, ఇటు క్రికెట్ పరంగా ఎన్నో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా భద్రతాపరమైన కారణాల దృష్ట్యా క్రికెట్ లో ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్ ఆడట్లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ లోనే తటస్థ వేదకలపై తలపడుతున్నాయి. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ ఫొటోషూట్ కోసం అక్కడి వేళ్తే అది పెద్ద సంచలనమే అవుతుంది. పైగా ఐసీసీ.. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి మరింత బజ్, క్రేజ్ తీసుకురావాలని యోచిస్తోంది. ఇటువంటి సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అక్కడికి వెళ్తే అది సెన్సేషనల్ అవుతుంది.
అస్సలు అయ్యే పనే కాదు!
అసలీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ దేశానికి టీమిండియా రావాలని పాకిస్థాన్ మొండి పట్టు పట్టినా.. మనోళ్లు తగ్గలేదు. పట్టుబట్టి మరీ హైబ్రిడ్ మోడల్ లోనే నిర్వహించేలా చేశారు. దౌత్యపరంగా కూడా పాకిస్థాన్ తో భారత ప్రభుత్వానికి ఎన్నో విభేధాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వందే బీసీసీఐ ఒక్క అడుగు కూడా ముందుకేయదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ పాకిస్థాన్ కు వెళ్లడమనేది అసాధ్యమనేనని అంటున్నాయి క్రికెట్ వర్గాలు.