హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం ది ఓవల్ వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కామెంటేటర్ అవతారమెత్తారు. టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో మైదానం నుంచి బాధ్యతలు నిర్వహించిన సెహ్వాగ్ ఈ సారి ఓ టీవీ స్పోర్ట్స్ ఛానల్లో హిందీ కామెంటేటర్గా అభిమానులను అలరించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఈ మ్యాచ్లో మ్యాచ్లో టీమిండియా... శ్రీలంక చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. శ్రీలంకను తేలికగా తీసుకుని టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 322 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

అనంతరం 322 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 48.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది. ఛేదనకు దిగిన శ్రీలంకను కట్టడి చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు.
పాక్తో జరిగిన మ్యాచ్లో రాణించిన కెప్టెన్ కోహ్లీ, యువరాజ్ సింగ్లు లంకపై అభిమానులను నిరాశపరిచారు. యువరాజ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చి ధోని తన అద్భుత ఇన్నింగ్స్తో అభిమానులను అలరించాడు. 52 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్లతో 63 పరుగులు చేశాడు.
ఈ సమయంలో కామెంటరీ బాక్స్లో ఉన్న సెహ్వాగ్... ధోనీ అర్ధ సెంచరీ చేశాక అతడి బలాన్ని గురించి చెబుతూ.. అతడు మహేంద్ర సింగ్ ధోనీ కాదు.. మహేంద్ర 'బాహుబలి' అని కామెంట్ చేశాడు. వెంటనే సెహ్వాగ్తో పాటు ఉన్న వ్యాఖ్యాతలు నవ్వులు చిందించారు. వన్డే కెరీర్లో ధోనికి ఇది 62వ అర్ధ సెంచరీ.
కాగా, 49.2వ ఓవర్లో చండీమాల్ బౌలింగ్లో ధోనీ అవుటైన సంగతి తెలిసిందే. ధోనీని ఉద్దేశించి సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ధోనిని బాహుబలి అనడంతో ప్రస్తుతం ట్విట్టర్లో దీనిపై కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి. ఇకనుంచి ధోనిని అందరూ మహేంద్ర బాహుబలి అని పిలవాలని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.