హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకుంది. అయితే ఇంగ్లాండ్ బయల్దేరడానికి ముందు ముంబైలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ క్రమంలో ఓ విలేకరి పదే పదే భారత్-పాక్ మ్యాచ్పై వేసిన ప్రశ్న గురించి అడుగుతుంటే కోహ్లీకి కోపమొచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రపంచకప్ కన్నా కఠినమైన టోర్నీ అని, తక్కువ సమయంలో ముగిసిపోయే టోర్నీ కావడంతో పోటీ చాలా ఎక్కువగా ఉంటుందని కోహ్లీ తెలిపాడు.

ఆ తర్వాత భారత్-పాక్ మ్యాచ్ గురించి మాట్లాడాడు. 'ఈ మ్యాచ్ అంటే అభిమానులకు చాలా ప్రత్యేకం. చాలా ఉద్వేగంతో చూస్తారు. కానీ మా వరకు అది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే. మామూలుగానే ఉంటాం' అని కోహ్లీ చెప్పాడు.
ఈ సమయంలో ఓ విలేకరి 'ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్తో మ్యాచ్ ఆడటం మంచిదేనా' అని ప్రశ్నించగా ముందుగా మీరేమి అనుకుంటున్నారు అని కోహ్లీనే ఎదురుప్రశ్న వేశాడు. దీంతో తెల్లబోయిన విలేకరి ' జట్టు సారథిగా ఉన్న మీ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి అడుగుతున్నాను' అని అన్నాడు.
వెంటనే కోహ్లీ కొంత కోపంతో... నిజంగా దీని గురించి ఇప్పుడు మాట్లాడుకోవల్సిన అవసరం లేదు. మా కంటే ముందే దీనిపై మీరు ఓ అభిప్రాయానికి వచ్చేసి ఉంటారు కదా' అని అనడంతో వీరిద్దరి సంభాషణకు తెరపడింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-బిలో ఉన్న భారత్ తన తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఎడ్జిబాస్టన్లో జూన్ 4వ తేదీన తలపడనుంది. ఈ టోర్నీకి ముందు టీమిండియా తన తొలి వార్మప్ మ్యాచ్లో శుక్రవారం బంగ్లాదేశ్తో ఆడనుంది. జూన్ 1 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.