గ్రేటర్ నొయిడా: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అధ్యక్షుడు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ పై ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఐసీసీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గురించి ప్రత్యేకంగా ఆలోచించనని చెప్పిన శశాంక్ మనోహర్పై అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.

'అధ్యక్షుడిగా మనోహర్ సేవలు అవసరమైన దశలో.. మునిగిపోయే నావను కెప్టెన్ వదిలేసినట్టుగా అతడు.. బోర్డును విడిచి ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టాడు. బోర్డుకు అతడి అవసరం ఉందని సభ్యులందరూ భావించారు. కానీ, ఆయన ముందుకు రాలేదు' అని అనురాగ్ చెప్పారు.
ఈ రోజు ఐసీసీ ఛైర్మన్గా మనోహర్ ఉన్నాడంటే అది బీసీసీఐ చలవేనని గుర్తుంచుకోవాలని సూచించారు. కానీ భారత క్రికెట్ ప్రయోజనాలకు విరుద్ధంగా అతడు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. బోర్డు సభ్యులు అతడి గురించి ఏం అనుకుంటున్నారన్నది అందరికీ తెలియాలని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నాడు.