
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సీఈవో మను సాహ్నీని సెలవుపై పంపించారు. ఐసీసీలోని సభ్య దేశాలు, ఉద్యోగులతో ఆయన ప్రవర్తన సరిగా లేదని విచారణ జరిపిన 'ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్' తేల్చి చెప్పడంతో ఐసీసీ ఉన్నపళంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సెలవుపై ఉన్న ఆయన చేత రాజీనామా చేయించేందుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం తెలుస్తోంది. ఐసీసీని కూడా శాసించగలిగే సామర్థ్యం ఉన్న బీసీసీఐ.. సాహ్నీ తీరుపై గుర్రుగా ఉంది.
2019 వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఐసీసీ సీఈవో పదవి నుంచి డేవ్ రిచర్డ్స్సన్ వెళ్లిపోయారు. ఆయన స్థానంలో మను సాహ్నీ వచ్చారు. 2022 వరకు పదవీకాలం ఉన్నా.. అన్ని విషయాల్లోనూ ఆయన ప్రవర్తన కఠిణాత్మకంగా ఉండటంతో సాగనంపక తప్పడం లేదు. సహోద్యోగులతోనూ ఆయన ఎంతో దురుసుగా ప్రవర్తించేవారని దర్యాప్తులో తెలిసింది. సాహ్నీ దురుసు ప్రవర్తనకు గురై బాధపడ్డవారిలో ఐసీసీ సిబ్బంది చాలా మందే ఉన్నారని బోర్డు సన్నిహిత అధికారి ఒకరు ఓ జాతీయ మీడియాకు తెలిపారు.
ఐసీసీ సీఈవో మను సాహ్నీ మర్యాదపూర్వకంగా రాజీనామా సమర్పించేందుకు బోర్డు సభ్యులు ప్రయత్నాలు మొదలు పెట్టారని ఐసీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. 'చాలా క్రికెట్ బోర్డులకు సాహ్నీపై ఇష్టం లేదు. కొత్త ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియలో ఆయన జోక్యంపై అసంతృప్తి చెందాయి' అని బీసీసీఐలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఐసీసీ ఈవెంట్లు నిర్వహించే దేశాలు ఫీజు చెల్లించాలన్న మను సాహ్నీ ప్రతిపాదనను బీసీసీఐతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బోర్డులు తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతేకాకుండా ఐసీసీ చైర్మన్ పదవికి న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లేను మూడు బోర్డులు ప్రతిపాదించగా.. సాహ్నీ మాత్రం తాత్కాలిక చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాకు మద్దతు తెలిపారు. ఇక ప్రతి ఏటా ఐసీసీ ఒక టోర్నీ నిర్వహించాలన్న సాహ్నీ ప్రతిపాదన కూడా పెద్ద బోర్డులకు రుచించలేదు.
ఐసీసీ సమావేశాల్లో చాలా వరకూ మను సాహ్నీ తీరుపై భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బోర్డులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనను ఐసీసీ సెలవుపై పంపించింది. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే.. తొలగించే ప్రక్రియ కూడా ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఐసీసీ బోర్డుకు ఉన్న 17 మంది డైరెక్టర్లలో 12 మంది ఇందుకు మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది.