
హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ ఎట్టకేలకు రద్దు చేసింది. 2021లో భారత్లో జరగాల్సి ఉన్న ఈ టోర్నీ స్థానంలో ప్రపంచ టీ20ని నిర్వహించాలని నిర్ణయించింది. సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని ఐసీసీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి డేవ్ రిచర్డ్సన్ చెప్పాడు. దీంతో వరుసగా రెండేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్లు జరగనున్నాయి. 2020లో ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ ఆతిథ్యమివ్వాల్సివుంది.
'2021లో భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ స్థానంలో ప్రపంచ టీ20 జరగనుంది. ఆటకు మరింత ప్రాచుర్యం తేవాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పు చేశాం' అని రిచర్డ్సన్ చెప్పాడు. 2009, 2010లో కూడా ఇలానే రెండు టీ20 కప్లు వరుసగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ల్లో జరిగాయి.
104 దేశాలకు టీ20 హోదా
క్రికెట్ను ప్రపంచమంతా విస్తరించేందుకు మొత్తం 104 సభ్య దేశాలకూ టీ20 హోదా ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. అంటే అర్జెంటీనా, పపువా న్యూగినియా మధ్య జరిగే మ్యాచ్కు కూడా అంతర్జాతీయ హోదా ఉంటుందన్నమాట. సభ్య దేశాలకు అంతర్జాతీయ క్రికెట్ ఆడడం తేలిక చేసేందుకు కొత్త కనీస ప్రమాణాలను ప్రవేశపెట్టాలని కోల్కతాలో జరిగిన త్రైమాసిక సమావేశంలో ఐసీసీ నిర్ణయించింది. అన్ని దేశాల మహిళల జట్లకు 2018 జులై 1న, పురుషుల జట్లకు 2019 జనవరి 1న టీ20 హోదా ఇస్తారు.
వచ్చే ఏడాది జూన్ నుంచి ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. న్యూజిలాండ్ క్రికెట్ సీఈఓ డేవిడ్ వైట్, జాన్ స్టీఫెన్సన్ల పదవులను క్రికెట్ కమిటీ వాయిదా వేసింది.