గతేడాది టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 11 మంది ఆటగాళ్లను జట్టుగా ఐసీసీ ప్రకటించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆ టీమ్కు కెప్టెన్గా నియమించింది. వన్డే వరల్డ్ కప్ అనంతరం పొట్టి ఫార్మాట్లో టీమిండియా తాత్కాలిక సారథిగా బాధ్యతలు అందుకున్న సూర్యకుమార్ ఐసీసీ మెచ్చిన కెప్టెన్గా నిలవడటం విశేషం.
మెగాటోర్నీ అనంతరం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టీ20ల సిరీస్ల్లో భారత జట్టును సూర్యనే నడిపించిన విషయం తెలిసిందే. ఆసీస్ సిరీస్ను కైవసం చేసుకోగా, సౌతాఫ్రికా సిరీస్ను 1-1తో సమం చేశాడు. 2023లో సూర్యకుమార్ బ్యాటర్గానూ విధ్వంసం సృష్టించాడు. 17 ఇన్నింగ్స్లో 48 సగటుతో, 155 స్ట్రైక్ రేటుతో 733 పరుగులు చేశాడు. దీనిలో రెండు సెంచరీలు ఉన్నాయి. అంతేగాక 2023 ఏడాదికి ఉత్తమ టీ20 క్రికెటర్ ఐసీసీ అవార్డుకు సూర్య షార్ట్ లిస్ట్ అయ్యాడు.

సూర్యకుమార్తో మరో ముగ్గురు టీమిండియా యువ ప్లేయర్లు ఐసీసీ 2023 టీ20 జట్టులో ఎంపికయ్యారు. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ అర్షదీప్ సింగ్ సెలక్ట్ అయ్యారు. గతేడాది ఆగస్టులో అరంగేట్రం చేసిన జైశ్వాల్ 14 ఇన్నింగ్స్ల్లో 430 పరుగులు చేశాడు. నంబర్ వన్ బౌలర్ ర్యాంక్ అందుకున్న బిష్ణోయ్ 44 ఓవర్లలో 18 వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ గతేడాదిలో 21 మ్యాచ్ల్లో 26 వికెట్లు పడగొట్టాడు.
ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టు: యశస్వీ జైశ్వాల్ (భారత్), ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్), నికోలస్ పూరన్ (వెస్టిండీస్, వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (భారత్, కెప్టెన్), మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్), సికిందర్ రజా (జింబాబ్వే), అల్పేష్ రంజానీ (ఉగాండ), మార్క్ అడైర్ (ఐర్లాండ్), రవి బిష్ణోయ్ (భారత్), రిచర్డ్ (జింబాబ్వే), అర్షదీప్ సింగ్ (భారత్)
కాగా, సూర్యకుమార్ యాదవ్ ఇటీవల సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. హెర్నియా సమస్యతో బాధ పడుతున్న సూర్య జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నెలలు సమయం పడుతుంది. ఐపీఎల్లో ప్రారంభ మ్యాచ్లకు అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.