ఆసియా కప్ మ్యాచ్లో భారత ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ వివాదంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన బెదిరింపులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) లొంగిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలన్న పాకిస్థాన్ డిమాండ్ను ఐసీసీ అంగీకరించింది. పాక్ మ్యాచులకు ఆండీ పైక్రాఫ్ట్ను ఐసీసీ దూరం పెట్టినట్లు తెలుస్తోంది. యూఏఈతో మ్యాచ్ కు రిఫరీగా రిచర్డ్సన్ను నియమించినట్లు సమాచారం.
వివాదం నేపథ్యం ఇదే..
ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు కరచాలనం చేయడానికి నిరాకరించారని పాకిస్థాన్ ఆరోపించింది. దీనికి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ అనుమతి ఇచ్చారని పాకిస్థాన్ పేర్కొంది. దీంతో పీసీబీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, పైక్రాఫ్ట్ను మిగతా మ్యాచ్లకు రిఫరీగా నియమిస్తే తాము టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది. ఈ బెదిరింపులకు మొదట ఐసీసీ అంగీకరించనప్పటికీ.. పీసీబీ తన నిర్ణయంపై గట్టిగా నిలబడింది. ముఖ్యంగా యూఏఈతో జరగబోయే కీలక మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ బెదిరించింది. దీనితో పాటు, పాక్ ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం కూడా రావడం లేదని వార్తలు వచ్చాయి. ఒకవేళ పాకిస్థాన్ తప్పుకుంటే టోర్నమెంట్ నిర్వహణకు పెద్ద నష్టం, ఆర్థికంగా కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని భావించి, ఐసీసీ వెనక్కి తగ్గింది.

ఐసీసీ నిర్ణయం
ప్రస్తుతం పాకిస్థాన్ ఆడే మ్యాచ్లకు ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా ఉండబోరని ఐసీసీ ప్రకటించింది. ఆయన స్థానంలో రిచీ రిచర్డ్సన్ను నియమించినట్లు సమాచారం. దీంతో పీసీబీ డిమాండ్లను ఐసీసీ అంగీకరించినట్లైంది. ఈ ప్రకటన తర్వాతే పాకిస్థాన్ ఆటగాళ్లు యూఏఈతో జరగబోయే మ్యాచ్ కోసం మైదానంలో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు.
ఐసీసీ ఛైర్మన్ జై షా పాకిస్థాన్ బెదిరింపులకు లొంగిపోవడం భారత అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి కూడా అయిన జై షా, ఇలాంటి వివాదాల పట్ల కఠినంగా వ్యవహరించకుండా, పీసీబీకి లొంగిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పాకిస్థాన్ అనవసరమైన ఆరోపణలు, బెదిరింపులతో తమకు అనుకూలమైన నిర్ణయాలను రాబట్టుకుంటుందని వారు విమర్శిస్తున్నారు.