
హైదరాబాద్: 66 సెంచరీలు, 94 హాఫ్ సెంచరీలు, 20396 పరుగులు. ఈ గణాంకాలు మరెవరివో కావు. టీమిండియా కెప్టెన్, రన్ మెషీన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీవే. ఈ పదేళ్లలో విరాట్ సాధించిన అసాధారణ రికార్డులు ఇవి. ఈ రికార్డులే తాజాగా ఐసీసీ అవార్డుల్లో కోహ్లీ దుమ్మురేపేలా చేశాయి. ఈ దశాబ్దపు ఐసీసీ అత్యుత్తమ ప్లేయర్గా ఎంపికైన కోహ్లీకి 'సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్' అవార్డు లభించింది. అంతేగాక ఈ దశాబ్దపు ఉత్తమ వన్డే ఆటగాడిగా కూడా నిలిచాడు. అయితే ఈ సందర్భంగా కోహ్లీ పదేళ్ల కిందట చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.
పదేళ్ల కిందట విరాట్ కోహ్లీ చేసిన ఆ ట్వీట్ను ఆయన అభిమానులే వైరల్ చేశారు. ఆ ట్వీట్ను 2010, మార్చి 16న కోహ్లీ పోస్ట్ చేశాడు. 'నా జట్టుకు భారీగా పరుగులు చేయాలని అనుకుంటున్నా' అని ఆ ట్వీట్లో విరాట్ పేర్కొన్నాడు. ఆశ పడటం, కలలు కనడమే కాదు.. దాన్ని చేసి చూపించాడు అని అభిమానులు ట్విటర్లో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అభిమానులు ఈ ట్వీట్కు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
పితృత్వ సెలవులపై విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ వచ్చాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరి ఆరంభంలో తొలి బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే విరాట్ ఇండియాకి వచ్చేశాడు. అయితే కోహ్లీ నిర్ణయంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక కోహ్లీ గైర్హాజరీతో భారత టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను రహానే అందుకున్నాడు. రెండో టెస్టులో భారత్ విజయానికి చేరువైంది.
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 87 టెస్టులాడి 53.4 సగటుతో 7,318 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 251 వన్డేల్లో 59.34 సగటుతో 12,040 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 60 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 85 టీ20లలో 50.5 సగటుతో 2,928 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21 వేలకు పైగా పరుగులు చేశాడు.