భారత్ను కవ్వించేలా చర్యలు చేపట్టాలనుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్నింగ్ ఇచ్చింది. పిచ్చి పనులు చేస్తే ఉపేక్షించేది లేదని ఐసీసీ స్ట్రాంగ్ ధమ్కీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. 1996 తర్వాత తొలిసారి ఐసీసీ ఈవెంట్కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది.
కానీ పాకిస్థాన్కు టీమిండియాను పంపించమని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. మాజీ, ప్రస్తుత పాక్ క్రికెటర్లు విజ్ఞప్తులు, అభ్యర్థనలకు బీసీసీఐ కరుణించలేదు. ఆసియా కప్ తరహాలోనే ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని పేర్కొంది. గతేడాది జరిగిన ఆసియా కప్కు పాక్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే భారత్ మ్యాచ్లను శ్రీలంక వేదికగా నిర్వహించారు.

మరోవైపు భారత్ను తమ దేశానికి రప్పించాలని ఐసీసీపై పాకిస్థాన్ ఒత్తిడి చేసింది. అయినప్పటికీ బీసీసీఐ పట్టుబట్టడంతో ఐసీసీ కూడా హైబ్రిడ్ మోడల్కే సై అనేలా సంకేతాలు జారీచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ను కవ్వించేలా పాకిస్థాన్ పూనుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శన చేయాలని నిర్ణయించుకుంది. శనివారం ఇస్లామాబాద్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ ప్రారంభం కానుందని, స్కర్దు, ముర్రే, హుంజా, ముజఫరాబాద్ వంటి ప్రాంతాలు సహా దేశవ్యాప్తంగా ట్రోఫీని ప్రదర్శించనున్నామని పాక్ బోర్డు పేర్కొంది.
స్కర్దు, హుంజా, ముజఫరాబాద్ వివాదాస్పద పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రాంతాలు. దీంతో ఐసీసీ రంగంలోకి దిగింది. పాక్ అక్రమిత కశ్మీర్లో టోర్నీ ప్రదర్శన చేస్తే ఉపేక్షించమని చెప్పింది. నిర్వహణలో భాగంగా ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ పాకిస్థాన్కు గురువారం పంపింది. 2008 ముంబయి దాడుల అనంతరం భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించని విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఆసియా కప్ వంటి టోర్నీల కోసం టీమిండియా తమ దేశానికి రావాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్నిసార్లు విన్నవించినా బీసీసీఐ అంగీకరించలేదు. కాగా, డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది.