హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్ను 1-2తేడాతో ఆతిథ్య వెస్టిండిస్ జట్టు చేజార్చుకోవడంతో ఆ జట్టు టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ ఎవిన్ లూయిస్ టాప్-10లో చోటు కోల్పోయాడు. ఆదివారం వెస్టిండిస్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన చివరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య వెస్టిండిస్ జట్టుకు వరుణుడు 18వ ఓవర్లో అంతరాయం కలిగించాడు. వర్షం వచ్చిన ఆట నిలిచిపోయే సమయానికి విండిస్ 17.1 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేసింది.
వెస్టిండిస్ విజయానికి 17 బంతుల్లో 50 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, ఎంతసేపటికీ వర్షం తగ్గక పోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ ప్రకారం 19 పరుగుల తేడాతో బంగ్లాదే విజయమని ప్రకటించారు. దీంతో వరుసగా రెండు టీ20లను గెలుచుకున్న బంగ్లా.. సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ సిరిస్లో అద్భుత ప్రదర్శన చేసిన మ్యాన్ ఆఫ్ది సిరీస్ అవార్డు అందుకున్న బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్, తమీమి ఇక్బాల్లు ఐసీసీ సోమవారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో తన ర్యాంకుని మరింతగా మెరుగుపరచుకున్నాడు.
షకీబ్ అల్ హసన్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 45వ స్థానంలో నిలవగా, తమీమ్ ఇక్బాల్ ఆరు స్థానాలు ఎగబాకి 39వ స్థానంలో నిలిచాడు. మూడో టీ20లో 32 బంతుల్లో 61 పరుగులు చేసిన బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించిన లిటన్ దాస్ 22 స్థానాలు ఎగబాకి 71వ స్థానంలో నిలిచాడు.
మొత్తం 351 పాయింట్లతో లిటన్ దాస్ తన కెరీర్లోనే మెరుగైన ర్యాంకుని అందుకున్నాడు. మరోవైపు వెస్టిండిస్ టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ ఎవిన్ లూయిస్ టాప్-10లో చోటు కోల్పోయాడు. అటు బంతితో ఇటు బ్యాట్తో రాణించిన ఆండ్రూ రస్సెల్ తన ర్యాంకుని మెరుగుపరచుకున్నాడు.
తన కెరీర్లోనే అత్యధికంగా 279 పాయింట్లతో రస్సెల్ 26 స్థానాలు ఎగబాకి 86వ స్థానంలో నిలిచాడు. ఇక, బ్యాట్స్మన్ ర్యాంకుల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్ 891 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, పాక్కు చెందిన ఫకార్ జమాన్ 842 పాయింట్లతో రెండో స్థానంలొ కొనసాగుతున్నాడు.
టీ20 బ్యాట్స్మన్ ర్యాంకుల్లో భారత్కు చెందిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ఇక, బౌలర్ల ర్యాంకుల్లో ఆప్ఘనిస్థాన్కు చెందిన రషీద్ ఖాన్ ఎప్పటిలాగే 813 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకుల్లో భారత్ నుంచి చాహాల్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు.