
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2022 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్కు సంబందించిన సమాచారాన్ని ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. మొత్తం 8 జట్లు మెగా టోర్నీలో ఆడనున్నాయి. 31 రోజులు, 31 మ్యాచ్లు ఆడనున్నట్లు ఐసీసీ తెలిపింది. న్యూజిలాండ్ వేదికగా 2022 మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు ఆరు మైదానాల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు ఐసీసీ పేర్కొంది.
2022 మహిళల టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ తొలి క్వాలిఫయర్ జట్టుతో తలపడనుంది. టీమిండియా మార్చి 6న తన మ్యాచ్ ఆడనుంది. భారత్ మరో క్వాలిఫయర్ జట్టుతో ఈ మ్యాచ్లో తలపడనుంది. ఏప్రిల్ మూడున ఫైనల్ మ్యాచ్ జరగనుందని ఐసీసీ తెలిపింది. ఆక్లాండ్, తారంగా, హామిల్టన్, వెల్లింగ్టన్, క్రైస్ట్చర్చ్, డునెదిన్ మైదానాలు ప్రపంచకప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కివీస్ బౌండరీలు కొంచెం దగ్గరగా ఉండడంతో పరుగుల వరద పారే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీకి విశేషమైన ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ టాప్ ఫేవరెట్గా బరిలోకి దిగగా.. ఫైనల్లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టోర్నీ ఆసాంతం వరుస విజయాలతో దూసుకెళ్లిన టీమిండియా తుదిపోరులో మాత్రం చేతులెత్తేసింది. దీంతో తొలిసారి టీ20 ప్రపంచకప్ సాధించాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్కు ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సుమారు 86 వేల మంది హాజరయ్యారు. ఇక డిజిటల్ మాధ్యమాల్లోనూ రికార్డు స్థాయిలో వీక్షించారు. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా మహిళల క్రికెట్కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దొరికింది. ఇక 2022లో వీక్షకుల సంఖ్య మరింత పెరగవచ్చని ఐసీసీ అంచనా వేస్తోంది.